న్యూఢిల్లీ: బీజేపీని ఎదుర్కోవడానికి భయపడే నాయకులందరూ పార్టీని విడిచి వెళ్లిపోవచ్చునని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎవరికీ భయపడకుండా దమ్మున్న నేతలెవరినైనా పార్టీలోకి స్వాగతిస్తామని చెప్పారు. పార్టీ సోషల్ మీడియా వర్కర్లతో రాహుల్ శుక్రవారం ఆన్లైన్లో మాట్లాడారు. ‘‘భయం లేని నాయకులెందరో బయట ఉన్నారు. వాళ్లంతా మనవారే. వారిని పార్టీలోకి ఆహ్వానిద్దాం. అలాగే భయపడుతూ బతికే నాయకులు మన పార్టీలో ఉన్నారు. వారిని బయటకు పంపేద్దాం’’ అని రాహుల్ అన్నారు.
జ్యోతిరాదిత్య సింధియా వంటి నేతల అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. ‘‘వాళ్లంతా ఆరెస్సెస్కి చెందినవారు. వారిని వెళ్లనిద్దాం. వారి అవసరం మనకి లేదు. మనకి భయం లేని నాయకులు కావాలి. మన సిద్ధాంతాలకు కట్టుబడే వాళ్లు కావాలి’’ అని రాహుల్ అన్నారు. తనతో మాట్లాడడానికి ఎలాంటి భయం వద్దని రాహుల్ అభయం ఇచ్చారు. ‘‘మనమంతా ఒకటే కుటుంబం. మీ సోదరుడి లాంటి వాడిని. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు’’ అని చెప్పారు.