పాదయాత్రలో పేదల కష్టాలు చూశా: డా. గురుమూర్తి

14 Apr, 2021 19:35 IST|Sakshi

శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ...

సాక్షి, చిత్తూరు: అప్పట్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి పాదయాత్ర చేసే భాగ్యం తనకు దక్కిందని తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డా. గురుమూర్తి అన్నారు. పాదయాత్రలో అడుగడుగునా పేదల కష్టాలు చూశానన్నారు. బుధవారం శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో జనం తరలి వచ్చారు. ఈ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..  వెంకటగిరిలో నేత కార్మికుల కష్టాలు చూసి సీఎం వైఎస్‌ జగన్‌ చలించిపోయారని గుర్తు చేసుకున్నారు. నేతన్నలకు ఆర్థిక సహాయం చేయడానికి ఆయన‌ ఆనాడే పూనుకున్నారని, కానీ దీన్ని తెలుగుదేశం తప్పుపట్టిందని మండిపడ్డారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సొంత జిల్లా చిత్తూరును అభివృద్ధి చేయలేని చంద్రబాబుకు కనీసం చెప్పుకోవడానికి ఒక్కటి కూడా లేదని ఎద్దేవా చేశారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో బాబు కొత్త డ్రామాలకు తెర లేపారని దుయ్యబట్టారు. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఇంతగా సంక్షేమ పథకాలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ గురుమూర్తి మంచి విద్యావేత్త అని, అందుకే ఈయనకు సీఎం జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. 17వ తారీఖున సంపన్నులకు పేదవాడికి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఎంపీ మిథున్‌ రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్‌ గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

చదవండి: టీడీపీ– జనసేన మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందా?

తిరుపతి ఉప ఎన్నిక రెఫరెండమే

>
మరిన్ని వార్తలు