రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దు 

8 Sep, 2020 04:05 IST|Sakshi

బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించాలి: కోదండరాం 

హన్మకొండ: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రెవెన్యూ చట్టంపై తొందరపాటు వద్దని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం సూచించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయడం, భూరికార్డులు చక్కదిద్దడం అవసరమేనని చెప్పారు. అయితే, నూతనంగా తీసుకొస్తున్న రెవెన్యూ బిల్లును ముందుగా సెలెక్ట్‌ కమిటీకి అప్పగించి విస్తృత చర్చ జరిగిన అనంతరం తుది రూపు ఇచ్చి చట్టం చేయాలని సూచించారు.

ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగకుండా చూడాలని కోరారు. రెవెన్యూ శాఖలో గందరగోళ పరిస్థితులు ఏర్పడటానికి ఒక్క వీఆర్‌ఓలను బాధ్యులను చేయడం సమంజసం కాదని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే మితిమీరిన రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. ప్రభుత్వ భూములు, అటవీ భూములు దున్నుకుంటున్న రైతులు, పేద, మధ్య తరగతి రైతులు, కౌలు రైతులకు హక్కులు కల్పించాలన్నారు.  కాగా, ఎల్‌ఆర్‌ఎస్‌తో ప్రజలపై భారం పడుతుందని పేర్కొన్న కోదండరాం.. రెగ్యులరైజేషన్‌కు రుసుం విధించడం సమంజసం కాదని తెలిపారు.

మరిన్ని వార్తలు