ప్రశాంత్‌ కిషోర్‌పై టీఎంసీ చీఫ్‌ సంచలన ఆరోపణలు

22 Feb, 2022 12:48 IST|Sakshi

పనాజీ: రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిషోర్‌, గోవా తృణముల్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ కిరణ్‌ కండోల్కర్‌ మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. కండోల్కర్‌.. ప్రశాంత్‌ కిషోర్‌పై సంచలన ఆరోపణలు గుప్పించారు. 

ఫిబ్రవరి 14వ తేదీన గోవాలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ జరిగింది. అయితే, ఈ ఎన్నికల్లో తృణముల్‌ కాంగ్రెస్‌కు ఎన్నికల సలహాదారులుగా ప్రశాంత్‌ కిషోర్‌ బృందం వ్యవహరించింది. ఇదిలా ఉండగా కిరణ్‌ కండోల్కర్ మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సలహాదారు I-PAC(ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) తమ పార్టీ అభ్యర్థులను విడిచిపెట్టిందని విమర్శించారు. కాగా, ప్రశాంత్‌ కిషోర్‌, అతని బృందం తీరుతో కలత చెందానని అన్నారు. ఈ క్రమంలోనే తాను తృణమూల్ కాంగ్రెస్ గోవా యూనిట్ చీఫ్ పదవిని వదులుకోవడం లేదని స్పష్టం చేశారు. 

అయితే,  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీకి I-PAC (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) సాయం అందించిన విషయం తెలిసిందే. మరోవైపు, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణముల్‌ కాం‍గ్రెస్‌.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. కండోల్కర్.. ఆల్డోనా అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయగా, అతని భార్య కవిత తృణమూల్ టిక్కెట్‌పై థివిమ్ నుండి పోటీ చేశారు. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
 

మరిన్ని వార్తలు