ఈ టీ ఖరీదు రూ.15 లక్షలు.. అయినా ఎగబడ్డ జనం

2 Aug, 2021 12:01 IST|Sakshi

కోల్‌కతా: రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడానికి కొందరు ప్రత్యేక దారిని ఎంచుకుంటారు. అదే తరహాలో టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్ర ప్రధానిని టార్గెట్‌ చేస్తూ ఏకంగా చాయ్‌ వాలా అవతారం ఎత్తారు. తన అభిమానులు, ప్రజలకు టీ ఇచ్చారు. దాని ధర రూ.15 లక్షలు అని చెప్పారు. అందరూ ఆ టీ తీసుకుని ఆనందంగా తాగారు. ఆ తర్వాత ఆయన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దైన శైలిలో సెటైర్స్ వేశారు. 

మిత్ర మాట్లాడుతూ.. మా తృణమూల్ కాంగ్రెస్సే కాదు, ఇతర విపక్షాలు కూడా బీజేపీ ప్రభుత్వం 2014లో ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలుచేస్తాయో అని ఎదురుచూస్తూనే ఉన్నాం. ప్రతి పౌరుడి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని మోదీ అప్పట్లో మాట ఇచ్చారు. మరి ఏళ్లు గడుస్తున్న ఆ రోజు ఇంకా రాలేదని, ఇది ఎప్పుడు నెరవేరనుందోనని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెటిజన్లలో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఈ కమర్‌హతి ఎమ్మెల్యే, కోల్‌కతాలోని భువానిపూర్ ప్రాంతంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులకు టీ అందిస్తూ.. "ఇది ఒక ప్రత్యేకమైన టీ. మోదీజీ రైల్వే స్టేషన్లలో చాయ్ వాలాగా ఉన్నప్పుడు చేసిన టీ రుచికి సరిపోతుందని నేను అనుకుంటున్నాను. దీన్ని ఉచితంగా అందిస్తున్నాను. కానీ మీరు ధర అడిగితే మాత్రం,  ఒక కప్పు ధరను రూ .15 లక్షలుగా చెప్తాను ఎందుకంటే ఇది మోదీ వాగ్దానం చేసిన మొత్తం కూడా 15 లక్షలే కనుక అంటూ విమర్శలు గుప్పించారు.
 

మరిన్ని వార్తలు