వరంగల్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు. 'హాత్ సే హాత్ జోడో' అభియాన్ లో భాగంగా రేవంత్ ఈ యాత్ర చేపడుతున్నారు.
తెలంగాణలో నియంతృత్వ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వైఎస్ఆర్ స్ఫూర్తితో తాను ఈ యాత్ర చేపడుతున్నట్లు రేవంత్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2003లో వైఎస్ఆర్ చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టి 2004లో టీడీపీని ఓడించి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాకతీయ రాజులపై వీరోచిత పోరాటం చేసిన సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం కోసమే తన పాదయాత్రను మేడారం నుంచి ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
రేవంత్ పాదయాత్ర షెడ్యూల్ ఇలా..
రేవంత్ మొదటి విడత పాదయాత్రలో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేయనున్నారు. ఫిబ్రవరి 22 వరకు ఈ యాత్ర సాగుతుంది. ఆ తర్వాత రెండు రోజులు విరామం తీసుకుని చత్తీస్గఢ్ రాయ్పూర్లో జరిగే కాంగ్రెస్ ప్లీనరీకి హాజరవుతారు. ఆ తర్వాత ఫిబ్రవరి 24 పాదయాత్ర రెండో విడత ప్రారంభమవుతుంది.
'హాత్ సే హాత్ జోడో అభియాన్'లో భాగంగా తెలంగాణలోని అన్ని గ్రామాలను కవర్ చేసి ప్రతి ఇంటికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేడయమే ఈ యాత్ర లక్ష్యమని ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్రావు థాక్రే చెప్పారు.
చదవండి: కాంగ్రెస్ కంచుకోటలో హోరాహోరీ.. ఈసారి గెలుపెవరిదో..?