సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో కాంగ్రెస్, అధికార పార్టీ నేతల మధ్య పొలిటికల్ హీట్ పెరిగింది. ఇరు పార్టీల నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా పాదయాత్ర సందర్భంగా ప్రగతి భవన్ను పేల్చాయాలని టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కాగా, రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదులు చేయడం, వార్నింగ్ సైతం చేశారు.
కాగా, తన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి సమర్థించుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. కేసులు మాకేమీ కొత్త కాదు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి. ప్రగతి భవన్లోకి ప్రజలకు ఎందుకు ప్రవేశం లేదని మేము అడుగుతున్నాము. తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సామాన్య ప్రజలను ఎందుకు రానివ్వడంలేదని ప్రశ్నిస్తున్నాము. అమరవీరుల కుటుంబాలను సైతం ప్రగతిభవన్లో అడుగుపెట్టనివ్వకుండా నిషేధం పెట్టినప్పుడు ప్రగతి భవన్ ఉంటే ఎంత? పోతే ఎంత?.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ ద్రోహులను వెతికి మరీ ప్రగతి భవన్లో కూర్చోబెట్టి పంచభక్ష్య పరమాన్నం పెడుతున్నారు. తెలంగాణ అనే పదాన్ని అసహ్యించుకున్న వారందరినీ ప్రగతి భవన్లో కూర్చోపెడుతున్నారు.. దాన్ని ఎలా సమర్ధించుకుంటారు?. కేసీఆర్ తెలంగాణ సమాజానాకి ఏం సమాధానం చెబుతారు?. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు మా కుటుంబమే అంటున్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ ద్రోహులు మంత్రులయ్యారు. మంత్రుల్లో 90 శాతం తెలంగాణ ద్రోహులే ఉన్నారు. కోవర్టు ఆపరేషన్లో మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఎక్స్పర్ట్ అన్నారు. ఎర్రబెల్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.