పేదరికంలో భారత్‌ నైజీరియాను దాటిపోయింది.. మోదీ ప్రభుత్వ వైఫల్యమే కారణం

5 Aug, 2022 08:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గారూ.. డొంక తిరుగుడు మాటలు, కుతంత్రాలకు మీరు ఎంతగా పూనుకున్నా మీ నిరర్దక ప్రభుత్వం చెప్పే అబద్ధపు ఆర్థిక గణాంకాలను (జుమ్లానా మిక్స్‌) దాచలేరు’అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు గురువారం ఒక ప్రకటనలో మండిప డ్డారు.

తాజాగా పార్లమెంట్‌లో దేశ ఆర్థిక వ్యవస్థపైన చర్చ జరిగిన సందర్భంగా నిర్మలాసీతారామన్‌ ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అసత్యాలు పలికారని కేటీఆర్‌ విమర్శించారు. ‘గత ముప్ఫై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోయింది. డాలర్‌ విలువ రూ.80కి చేరింది. గడిచిన 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగరేటు పెరిగింది. ప్రపంచంలో వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర భారత్‌లోనే ఎక్కువ. పేదరికంలో నైజీరియాను భారతదేశం దాటిపోయింది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

‘మీకున్న బలంతో జీఎస్‌టీ కౌన్సిల్, పార్లమెంటులో మందబలంతో నెట్టుకుపోతారేమో. కోవిడ్‌ కంటే ముందు నుంచే వరుసగా ఎనిమిది త్రైమాసికాల పాటు ఆర్థిక మందగమనంలో ఉండగా లాక్‌డౌన్‌ వచ్చి పడింది. దీంతో దేశం ప్రస్తుతం తీవ్రమైన వేదన అనుభవిస్తోంది’ అని కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు.

మోదీ ప్రభుత్వం వల్లే వెనుకబాటు
ప్రజాస్వామ్య సూచీ మొదలుకుని అన్ని ప్రపంచ ర్యాంకుల్లో భారత్‌ వెనుకబడ టానికి మోదీ ప్రభుత్వమే కారణమని కేటీఆర్‌ ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుకు ముందు దేశంలో రూ.18 లక్షల కోట్ల నగ దు చెలామణిలో ఉండగా, అది ప్రస్తుతం 21 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు.  పసిపిల్లలు వాడుకునే పెన్సిళ్లు మొదలు ఆసుపత్రి పడకలు, చేనేత వస్త్రాలు, నిత్యావసర వస్తువులపై మోదీ ప్రభుత్వం పన్నుల భారం మోపిందని ఆరోపించారు. క్రోనీ కాపిటలిజాన్నే తమ ఆర్థిక విధానంగా అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగడుతున్న వ్యక్తులు, పార్టీ లపై ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసి గొల్పుతోందని విమర్శించారు.
చదవండి: కాంగ్రెస్‌లోకి చెరుకు సుధాకర్‌.. మునుగోడు కోసమేనా?

మరిన్ని వార్తలు