కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్‌

1 Jul, 2022 15:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణకు కేంద్రం నుంచి ఒక మంచిపనైనా చేయించడం చేతగాని దద్దమ్మగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మిగిలిపోయారంటూ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను మోసం చేస్తోంది కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాదా?. కేంద్రమంత్రిగా తెలంగాణ కోటాలో ఉండి రాష్ట్రానికి కిషన్ రెడ్డి ఏం తెచ్చాడు?. కేంద్రం తెలంగాణకు ఏ శాఖలోనైనా ఒక్క ప్రాజెక్టు ఇవ్వకున్నా నోరు మూసుకొని కూర్చుంది కిషన్ రెడ్డి కాదా?.

విభజన చట్టం ప్రకారం కేంద్రం ఒక్క హామీ నెరవేర్చకున్నా కిషన్ రెడ్డి ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు?. కిషన్ రెడ్డిని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయాల్లో గుమస్తాలు కూడా గుర్తు పట్టరు. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు ఆనాడు రాజీనామా చేస్తే.. కిషన్ రెడ్డి చేయకుండా పారిపోయాడు. తెలంగాణ ద్రోహి కిషన్ రెడ్డి. తెలంగాణ గడ్డపై కాకుండా ఢిల్లీలో మోదీ, అమిత్ షా దగ్గర ఎగిరిపడితే బాగుంటుంది. దేశాన్ని కార్పొరేట్‌ సంస్థలకు అప్పగిస్తున్న మోసపు చరిత్ర బీజేపీది.

కిషన్ రెడ్డి వల్ల తెలంగాణకు, నరేంద్రమోదీ వల్ల దేశానికి ఉపయోగం లేదు. నరేంద్రమోదీ ప్రజా ఖండన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతారు. బీజేపీ ఒక దొంగలముఠా. జాతీయ కార్యవర్గ భేటీ పేరుతో బీజేపీ నాయకులు వసూళ్లకు దిగారు. దౌర్జన్యంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. బీజేపీ అవినీతి అక్రమాలు త్వరలో బయటపెడుతాం. పార్లమెంట్ సాక్షిగా వసూళ్ల దందాను నిలదీస్తాం. తెలంగాణకు ఇప్పటి దాకా ఏం చేశారో, రాబోయే రోజుల్లో ఏం చేస్తారో చెప్పాలి' అని ఎమ్మెల్యే బాల్కసుమన్‌ బీజేపీని డిమాండ్‌ చేశారు.

చదవండి: (ప్రధాని మోదీ రాక.. టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలపై కిషన్‌ రెడ్డి ఫైర్‌)

మరిన్ని వార్తలు