వేడెక్కిన మునుగోడు రాజకీయం.. అర్థరాత్రి హైడ్రామా

16 Aug, 2022 09:44 IST|Sakshi

యాదాద్రి భువనగిరి: మునుగోడు రాజకీయం మరింత వేడెక్కింది. ఇటీవల కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరేందుకు సిద్ధం కాగా, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేతలు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.  చౌటుప్పల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి సహా పలువురు నేతలు బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే టచ్‌లో ఉన్నారు. త్వరలో బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు వెంకటరెడ్డి తెలిపారు. తనతో సహా పలువురు స్థానిక నేతలు బీజేపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. 

అర్థరాత్రి హైడ్రామా
ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో తాడూరి నివాసం వద్ద సోమవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తాడూరి ఉండే నివాసానికి ఎస్‌వోటీ, సీసీఎస్‌ పోలీసులు వచ్చి అరెస్ట్‌ చేసేందుకు యత్నించారు. భూవివాదానికి సంబంధించిన గతంలో నమోదైన కేసులను మరోసారి తెరపైకి తెచ్చి తాడూరిని అరెస్ట్‌ చేసే యత్నం చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులతో తాడూరి వాగ్వాదానికి దిగారు. విచారణ నిమిత్తం అరెస్ట్‌ చేసేందుకు వచ్చామని అక్కడకు వచ్చిన పోలీసులు తెలపగా, అసలు ఎందుకు అరెస్ట్‌ చేసి విచారిస్తారని తాడూరి నిలదీశారు. అర్థరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీస్ లు ఎంపీపీ వెంకట్‌రెడ్డి ఇంటిని చుట్టూ ముట్టిన విషయం తెలిసి.. ఎంపీపీ ఇంటికి  బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి , బీజేపీ నేతలు చేరుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావారణం ఏర్పడింది. తాడూరి అరెస్ట్‌ను అక్కడకు వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. కాగా, తాడూరికి నోటీసులు ఇచ్చారు చౌటుప్పల్‌ పోలీసులు.

వారు చౌటుప్పల్‌ పోలీసులు కాదు
ఈ అంశానికి సంబంధించి తాడూరి స్పందించారు.  ‘హైదరాబాదులో ఉంటున్న తన అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కి అర్థరాత్రి చౌటుప్పల్ పోలీసులమని చెప్పి అరెస్ట్ చేసేందుకు కొందరు వచ్చారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. చౌటుప్పల్ పోలీసులు కాదు. నేను అందర్నీ గుర్తు పడతాను. నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నేను టీఆర్ఎస్ పార్టీ ఎంపీపీని నాతో పాటు కొద్ది మంది జెడ్పీటీసీలు ఎంపీపీలు మరికొంత మంది కార్యకర్తలు మేమందరం కలిసి మాట్లాడుకునే బీజేపీలోకి పోదామనే అనుకున్నాం. ఈ సమయంలోనే మా ఇంటికి ఎవరో వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారు’ అని అన్నారు.

మరిన్ని వార్తలు