మోదీలా ట్రంప్‌ చేయలేకపోయారు

6 Nov, 2020 10:00 IST|Sakshi
ట్రంప్‌-మోదీ (ఫైల్‌ఫోటో)

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

పట్నా : ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేకిత్తిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. డెమోక్రటిక్‌ అభ్యర్థి బైడెన్‌ మేజిక్‌ మార్క్‌ సమీపానికి చేరుకున్నారు. విజయానికి మరో ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. తాజా ఫలితాలపై రిపబ్లిక్‌ పార్టీ అభిమానులతో పాటు డొనాల్డ్‌ ట్రంప్‌ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఎన్నికల్లో అవకతవకాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు ట్రంప్‌ వైఫల్యాల కారణంగానే తాజా ఫలితాల్లో రిపబ్లికన్లు వెనుకబడ్డారని అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా సమయంలో ఆయన అనుసరించి విధానాలు అమెరికన్లు విశ్వాసాన్ని కోల్పోయారని చెబుతున్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై భారత్‌లోనూ ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితం ఎవరికి అనుకూలంగా వస్తోందోనని ఆసక్తికరంగా ఎదురుచుస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజా ఫలితాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు.

‘కరోనా సమయంలో భారత్‌లో నరేంద్ర మోదీ చేయగలిగిన పనిని అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ చేయలేకపోయారు. మోదీ ఎంతో ప్రణాళికా బద్ధంగా కోవిడ్‌ను ఎదురుర్కొన్నారు. ప్రజలను, దేశాలన్ని సురక్షితంగా కాపాడారు. అగ్రరాజ్యం అమెరికా కరోనా విపత్తును ఎదుర్కోవడంలో తీవ్రంగా విఫలమైంది.  ఆ దేశంలో పెద్ద ఎత్తున పౌరులు ప్రాణాలను కోల్పోయారు. దాని ప్రభావం తాజా ఎన్నికలపై చూపింది. అంతిమంగా ట్రంప్‌ వెనుకంజకు దారితీసింది’ అని అన్నారు. బిహార్‌ మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా దర్భంగాలో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా ప్రసంగించారు. దేశంలోని 130 కోట్ల జనాభా భద్రత మోదీ చేతిలో క్షేమంగా ఉందన్నారు. బీజేపీ-జేడీయూ విజయం బిహార్‌ అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు.

>
మరిన్ని వార్తలు