కోరల్లేని పాములు కేసీఆర్, మోదీ

12 Jul, 2022 02:53 IST|Sakshi
కోదాడ మహాసభలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ  

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యాస్త్రం 

సాక్షి, కోదాడ అర్బన్, హైదరాబాద్‌: రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ కోరల్లేని పాముల్లా బుసలు కొడుతున్నారని, కాటు మాత్రం వేసుకోవడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ వ్యంగ్యంగా అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సీపీఐ జిల్లా మహాసభల సందర్భంగా సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో నారాయణ మాట్లాడుతూ దేశాన్ని ఇప్పటివరకు పాలించిన 14 మంది ప్రధానులు ప్రభుత్వరంగ సంస్థలను తీసుకొస్తే, ఒక్క మోదీనే 24 ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.  

మోదీ దత్తపుత్రుడైన ఆదానీ సంస్థ నుంచి బొగ్గును రాష్ట్రాలన్నీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మహాసభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బొమ్మగాని ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  కాగా, మంచిర్యాల జిల్లాలో ఆదివాసీ మహిళను వివస్త్రను చేసి, స్టేషన్‌కు తరలించిన రేంజ్‌ ఆఫీసర్‌ రత్నాకర్‌ రావును వెంటనే ప్రభుత్వం సస్పెండ్‌ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ డిమాండ్‌ చేశారు. ఆయన సోమవారం పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ఆదివాసీ మహిళలపై అటవీ, పోలీస్‌ శాఖల దాడులను తీవ్రంగా ఖండించారు.  

మరిన్ని వార్తలు