ఆర్మూర్‌లో దాడి జరిగింది, కానీ.. గన్నారంలోనే జరగాల్సింది: ఎమ్మెల్యే

17 Feb, 2022 18:26 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నేతలలు హాట్‌ కామెంట్స్‌ చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ హెచ్చరించారు. నోటికెంత వస్తే అంత మాట్లాడితే సహించేది లేదన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇష్టం వచ్చినట్టు  మాట్లాడుతున్నాడు కాబట్టే ఆర్మూర్‌లో దాడి జరిగిందన్నారు. వాస్తవానికి గన్నారంలోనే జరగాల్సిందని, సీఎంతో పాటు మంత్రులను, ఎమ్మెల్యేలను తిడుతుంటే కొట్టడం కరెక్ట్ అని సమర్థించుకున్నారు.  బీజేపీ నాయకులకు ఎదురు తిరగాలని, ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ దేశానికి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అర్వింద్, రేవంత్ రెడ్డిలు తెలంగాణకు శనిలా మారారని విమర్శించారు. తమ ఆట మొదలైందని, కేసీఆర్‌ను విమర్శిస్తే వేటాడి వెంటాడుతామని హెచ్చరించారు.
చదవండి: సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు.. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌

దేశమంతా కేసీఆర్ వైపు చూస్తోందని, దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లు విషం కక్కుతున్నారని, దీనిపై తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కేసీఆర్ బర్త్ డే రోజు బీజేపీపై యుద్ధం ప్రకటిస్తున్నామని తెలిపారు. తెలంగాణ పథకాలు అమలు చేయాలంటూ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ప్రజలు.. ఆ పార్టీల ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ప్రస్తావించారు.
చదవండి: మేడారం మహాజాతరలో అద్భుతం ఆవిష్కృతం

మరిన్ని వార్తలు