మేఘాలయలో బీజేపీ బిగ్‌ ప్లాన్‌.. ఉద్దవ్‌ థాక్రే సంచలన కామెంట్స్‌!

6 Mar, 2023 08:41 IST|Sakshi

ముంబై:  ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాలేదు. దీంతో ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ(ఎన్‌పీపీ)కి బీజేపీతో సహ ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇక, అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. దీంతో, మేఘాలయలో రాజకీయాలపై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్‌ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని టార్గెట్‌ చేసి తీవ్ర విమర్శలు చేశారు. 

కాగా, ఉద్దవ్‌ థాక్రే ఆదివారం.. మహారాష్ట్రలోని ఖేడ్‌ పట్టణంలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా థాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్రలో నేను ముఖ్యమంత్రిని కావడం కోసం నేను ఎన్సీపీ, కాంగ్రెస్‌ బూట్లు నాకానని పుణెలో అమిత్‌ షా అన్నారు. ఇప్పుడు వాళ్లు మేఘాలయాలో ఏం చేస్తున్నారు? అంటూ విమర్శలు చేశారు. గో మూత్రం చల్లడం వల్ల మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందా?. స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పిస్తే మనకు స్వాతంత్య్రం వచ్చిందని ఫైర్‌ అయ్యారు.  

ఇదే సమయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్ గురించి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. పటేల్‌‌.. ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించారని అన్నారు. కానీ, ఆయన పేరును కూడా బీజేపీ వాడుకుంటోంది. అదే విధంగా సుభాష్‌ చంద్రబోస్‌, బాలాసాహెబ్‌ థాక్రే పేర్లను కూడా వాళ్లు దొంగిలించారు. వాళ్లు శివసేన పేరు, బాలాసాహెబ్‌ ఫొటోతో కాకుండా మోదీ పేరుతో ఓట్లు అడగాలని నేను సవాల్‌ చేస్తున్నా అంటూ కౌంటర్‌ ఇచ్చారు. శివసేన బాణం-విల్లు గుర్తుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తప్పు. మా నుంచి పార్టీ పేరు, గుర్తును లాగేసుకున్నారు. కానీ, శివసేనను నా నుంచి ఎవరూ తీసుకోలేరు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు