Hijab Row: కేంద్రం హోంమంత్రి అమిత్‌ షా ఏమన్నారంటే..

21 Feb, 2022 20:45 IST|Sakshi

Amit Shah On Hijhab Row: హిజాబ్‌పై ప్రభుత్వ నిషేధాజ్ఞాలపై కర్నాటక హైకోర్టులో విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోపక్క దేశంలోని పలు ప్రాంతాల్లోనూ ‘హిజాబ్‌’ ఎఫెక్ట్‌ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. ఇక ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పెదవి విప్పారు.

సోమవారం ఓ ప్రముఖ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌ షా ఎట్టకేలకు హిజాబ్‌ అంశంపై స్పందించారు. ‘నా వరకైతే విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరించడం కంటే.. యూనిఫామ్‌ ధరించి మాత్రమే స్కూల్‌కు వెళ్లడం మంచిది. ఒకవేళ కోర్టు గనుక తీర్పు వెలువరించాక నా ఈ నిర్ణయంలో ఏమైనా మార్పు రావొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది నా వ్యక్తిగత అభిప్రాయం. న్యాయస్థానాల నిర్ణయాల్ని ఎవరైనా అంగీకరించాలి కాబట్టి. అంతిమంగా.. దేశం రాజ్యాంగం లేదంటే ఇష్టానుసారం నడుస్తుందా? అనేది మనమే నిర్ణయించుకోవాలి’ అని వ్యాఖ్యానించారాయన. 

ఇదిలా ఉండగా.. హిజాబ్‌ వ్యతిరేక ఆజ్ఞలపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం వాదనల సందర్భంగా కోర్టులో గట్టిగా తన చర్యలను సమర్థించుకుంటోంది. మరోపక్క బీజేపీ, అనుబంధ విభాగాలు కొన్ని ఈ వ్యవహారాన్ని దేశస్థాయిలోకి విస్తరిస్తున్నాయి.

మరిన్ని వార్తలు