ఎలాగూ రాజీనామా చేయ్సాలిందే.. కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌

13 Feb, 2023 12:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజీనామా చేసేందుకు అంత తొందరెందుకని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికల్లో ఓడిపోయాక ఎలాగూ గవర్నర్‌కు రాజీనామా సమరి్పంచక తప్పదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి ప్రజల్లో ఆదరణ తగ్గిపోవడాన్ని, బీజేపీని ప్రజలు ఆదరిస్తుండటాన్ని కేసీఆర్‌ తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి మాటల్లో నిరాశ, నిస్పృహ, నిర్వేదం స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

దేశ ఆర్థిక పరిస్థితుల గురించి, జీడీపీ గురించి అసత్యాలు, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్‌.. వాస్తవ పరిస్థితులపై చర్చించేందుకు ముందుకు రావాలని సవాల్‌  విసిరారు. అయితే గౌరవప్రదమైన భాషలో మాట్లాడతానంటేనే తాను చర్చకు వస్తానని అన్నారు. చర్చల కోసం ప్రెస్‌క్లబ్‌ అయినా, అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపమైనా సరే తాను సిద్ధమేనని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  

కేంద్రంపై బురద జల్లడమే ఏకైక టార్గెట్‌ 
‘రాష్ట్రం కోసం కల్వకుంట్ల కుటుంబం ఏం చేసిందో చెప్పుకోకుండా.. బీజేపీని, మోదీని తిట్టేందుకు వేదికగా, ఒక పొలిటికల్‌ సమావేశంగా అసెంబ్లీని మార్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వంపై బురద జల్లడమే ఏకైక టార్గెట్‌గా సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్‌ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం. మొన్నటివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అద్భుతమంటూ కీర్తించిన నోటితోనే.. ఇవాళ కాంగ్రెస్‌ పాట పాడుతున్నారు.

మొన్నటి వరకు కమ్యూనిస్టులను తిట్టిన తిట్టు తిట్టని కేసీఆర్, ఇప్పుడు వారిని ఆహా.. ఓహో అంటూ పొగుడుతున్నారు. కేసీఆర్‌ జతకట్టని పార్టీ ఏదైనా ఉందా..?’అంటూ కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.  

కాంగ్రెస్‌తో జట్టు కట్టే ఆలోచనలో ఉన్నారు..  
‘తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్‌ పార్టీ లేకుండా చేసిన కేసీఆర్‌.. శాసనసభలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించకుండా తన పారీ్టలోకి లాక్కున్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌తో జతకట్టే ఆలోచనలో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. మన్మోహన్‌ సింగ్‌ సర్కారును, ఇందిరాగాంధీ పాలనను పొగుడుతూ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేయడం ఇందుకు నిదర్శనం. యూపీఏ హయాంలో దేశం అవినీతి కోరల్లో చిక్కుకుపోతే.. ఆ పాలనను ప్రశంసిస్తూ కేసీఆర్‌ మాట్లాడటం హాస్యాస్పదం. ఆర్థిక వృద్ధిరేటు, తలసరి ఆదాయంపై కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడారు.

భారత్‌ను బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, మయన్మార్, సింగపూర్‌ దేశాలతో పోల్చడం కేసీఆర్‌కు ఉన్న అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టింది. ఏ ఆర్థికవేత్తకు కూడా అర్ధంకాని రీతిలో, ఎటువంటి ఆధారాలు లేకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై పచ్చి అబద్ధాలు మాట్లాడారు. దేశాన్ని బద్నామ్‌ చేసేందుకు కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నం ప్రజలకు అర్ధమవుతోంది..’అని కిషన్‌రెడ్డి చెప్పారు.

‘హైదరాబాద్, రంగారెడ్డిలో తలసరి ఆదాయం ఎంత? ఆసిఫాబాద్‌ కొమురం భీమ్‌ జిల్లాలో ఎంత?’అనే విషయాన్ని కూడా సీఎం చెబితే ప్రజలు స్వాగతిస్తారని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నట్లుగా అప్పులు చేసి కమీషన్లు కొట్టేసే ప్రభుత్వం కేంద్రంలో లేదని అన్నారు. తెలంగాణలో అప్పులు, కమీషన్ల పేరుతో వేలకోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు.  

చదవండి: పక్కా​ ప్లాన్డ్‌గా.. బీజేపీ హైకమాండ్‌ కొత్త స్ట్రాటజీ..

మరిన్ని వార్తలు