వ్యాక్సినేషన్‌పై రాష్ట్రమంత్రులకు అవగాహనలేదు: కిషన్‌రెడ్డి  

7 Jun, 2021 08:21 IST|Sakshi

బన్సీలాల్‌పేట్‌: కరోనా విషయంలోతెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. వ్యాక్సినేషన్‌ గురించి రాష్ట్రమంత్రులు అవగాహన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని బోయిగూడ మల్టీపర్పస్‌ ఫంక్షన్‌హాల్‌లో  వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఉందనే విషయాన్ని మంత్రులు గ్రహించాలని, డబ్బులు పెట్టినా వ్యాక్సిన్లు దొరకడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 82 లక్షల 43 వేల వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేసిందని చెప్పారు. ఈ నెల 5 వరకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద 6 లక్షల 70 వేల డోసులు నిల్వ ఉన్నాయని వివరించారు.

తెలంగాణలోని 46 ప్రభుత్వ ఆసుపత్రులకు 1,400 వెంటిలేటర్లను కేంద్రం అందజేయగా, హైదరాబాద్‌లో 758 వెంటిలేటర్లను ఆయా ఆసుపత్రులకు సమకూర్చినట్లు చెప్పారు.  కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకోడానికి కేంద్రం ఉచితంగా 5 కిలో బియ్యాన్ని పంపిణీ చేస్తున్నదని గుర్తు చేశారు.  

చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్‌ వెంటే..
ఖరీదైన వైద్య పరీక్షలు ఇక ఉచితం

మరిన్ని వార్తలు