Kishan Reddy: ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎక్కడి నుంచి వచ్చారు?

4 Nov, 2022 13:03 IST|Sakshi

న్యూఢిల్లీ: మునుగోడు ఎన్నిక తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ఆందోళనపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్దాలే. రోహిత్‌రెడ్డితో ప్రభుత్వం కూలిపోతుందనుకుంటే మేం చేసేదేమీ లేదు. ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే స్వామీజీలు అవసరమా? మేం చేర్చుకోలేమా? అని ప్రశ్నించారు.

బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరొచ్చినా పార్టీలో చేర్చుకుంటామని తెలిపారు. బ్రోకర్లను మధ్యలో పెట్టాల్సిన ఖర్మ మాకు పట్టలేదన్నారు. కేసీఆర్‌ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటు చర్య అని మండిపడ్డారు. కేటీఆర్‌ సీఎం కాడనే భయంతో కేసీఆర్‌ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన మాకు లేదు. రాష్ట్రంలో మాకు ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే. వచ్చే ఎన్నికల్లో మేం ప్రజాస్వామ్య బద్ధంగానే అధికారంలోకి వస్తామని అన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామని మేం ఎప్పుడూ చెప్పలేదన్నారు.

గతంతో టీడీపీ ఎలా బురదజల్లే ప్రయత్నం చేసిందో ఇప్పుడు కేసీఆర్‌ అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. 2014 నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలను మీరు చేర్చుకున్నారు?. ఒక్క ఎమ్మెల్యేతోనైనా రాజీనామా చేయించారా? అని ప్రశ్నించారు. నలుగురు ఆర్టిస్ట్‌లను పెట్టి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు వేరే పార్టీ నుంచి వచ్చారు. ఆ ఎమ్మెల్యేలకు వంద కోట్లు కాదు వంద పైలు కూడా అనవసరమే అని ఎద్దేవా చేశారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలిచిచ అధికారం చేపడుతుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 

చదవండి: (సీఎం కేసీఆర్‌కు బీజేపీ ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్‌ సవాల్‌)

మరిన్ని వార్తలు