కేసీఆర్‌ సినిమా అట్టర్‌ఫ్లాప్‌ 

28 Oct, 2022 02:31 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి 

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా 

ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం ఆరోపణలు టీఆర్‌ఎస్‌ సృష్టి 

దీనిపై సుప్రీం జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలి 

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్‌ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ఈ ఆరోపణల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారి ప్రమేయం ఉన్నందున సీబీఐ దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్‌ స్క్రిప్ట్, డైరెక్షన్, మేకప్‌తో రూపొందించిన ఎమ్మెల్యేల కొనుగోలు సినిమా అట్టర్‌ఫ్లాప్‌ అని అన్నారు.

నలుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేసిందన్న ఆరోపణలు పూర్తిగా కల్పితమన్నారు. ఆ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ను వీడితే సర్కార్‌ పడిపోతుందా? బీజేపీ ప్రభు త్వం వస్తుందా? అని ప్రశ్నించారు. గురువారం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి  వచ్చింది? అది ఎవరిది? పోలీసులు పట్టుకున్న రూ.400 కోట్లు ఎక్కడున్నాయో చెప్పా లని డిమాండ్‌ చేశారు.

ఈ డబ్బును వెంటనే ఆదాయపు పన్ను శాఖకు అప్పగించాలని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న నలుగురు ఎమ్మెల్యేలను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎందుకు విచారించలేదని నిలదీశారు. మునుగోడులో ఓటమి తప్పదని స్పష్టంకావడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త్త డ్రామాలు, వింత నాటకాలు, కుట్రలకు టీఆర్‌ఎస్‌ తెరతీసిందని దుయ్యబట్టారు. 

మీ ఫిరాయింపుల జాబితా బయటపెట్టండి 
గత 8 ఏళ్లలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ, మున్సిపల్‌ చైర్మన్లను బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్న నేతల జాబితా బయటపెట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌చేశారు. తెలంగాణలో ఫిరాయింపులకు పెద్దపీట వేసి ఇతరపార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదేనన్నారు. టీఆర్‌ఎస్‌లో టీడీపీ విలీనం, 2018 ఎన్నికల్లో గెలిచిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను, శాసనమండలిలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలను, వైఎస్సార్‌సీపీ నుంచి ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను, బీఎస్‌పీ, సీపీఐకున్న ఒక్క ఎమ్మెల్యేనూ చేర్చుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు అక్కర్లేదు తమకు రూ.400 కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యే లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి చెప్పారు. పోలీసులు ఫామ్‌హౌజ్‌కు చేరుకోక ముందే టీఆర్‌ఎస్‌ సోషల్‌మీడియా వింగ్‌ బీజేపీ వ్యతిరేక ప్రచార గ్రాఫిక్స్‌ తయా రుచేసుకుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునన్నారు. రాబోయే రోజుల్లో కల్వకుంట్ల కుటుంబానికి నిద్ర లేకుండా చేయడానికి నాలుగు ‘ఆర్‌’లు చాలని(రాజా సింగ్, రఘునందన్‌ రావు, రాజేందర్, గెలవబోయే రాజ్‌ గోపాల్‌ రెడ్డి) చెప్పారు. టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యే లు రాజీనామా చేసి వస్తే బీజేపీలోకి తీసుకుంటామని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిచ్చారు.  

మరిన్ని వార్తలు