నేనెవరికీ భయపడను: కేంద్ర మంత్రి రాణె

26 Aug, 2021 06:00 IST|Sakshi

రాణె వ్యాఖ్య

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేనుద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణె మరోసారి గట్టిగా సమర్థించుకున్నారు. బుధవారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. ‘‘నేనెవరికీ భయపడను. నా వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదే లేదు. దేశానికి స్వాతంత్యం ఏ సంవత్సరంలో వచ్చిందో కూడా గుర్తుపెట్టుకోలేని ఒక ముఖ్యమంత్రిపై నేను చేసిన వ్యాఖ్యలు.. నాలోని ఆగ్రహానికి అక్షరరూపాలు. నేనేమన్నానో మీడియా మిత్రులకూ తెలుసు. చదవండి: చిన్న పార్టీల జోరు..అధిక సీట్ల కోసం బేరసారాలు

అదెలా నేరమవుతుంది?. నిజానికి ఠాక్రే.. కేంద్ర మంత్రి అమిత్‌ షా, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లను ఇంతకంటే దారుణమైన మాటలతో విమర్శించారు. అమిత్‌ షాను ‘సిగ్గులేని వాడు’ అని, సీఎం యోగిని చెప్పులతో కొట్టాలని ఠాక్రే గతంలో దుర్భాషలాడారు’’ అని రాణె విమర్శించారు. శివసేన పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి చేయాలని చూసే వారి దవడలు పగలగొట్టాలని పార్టీ కార్యకర్తలకు ఠాక్రే గతంలో ఆదేశించారని రాణె గుర్తుచేశారు.

నాసిక్‌ కేసులో అరెస్ట్‌ చేయబోం
నాసిక్‌లో నమోదైన ‘రాణె వ్యాఖ్యల’ కేసులో ఆయనపై సెప్టెంబర్‌ 17తేదీ వరకు అరెస్ట్‌ లాంటి ఎలాంటి తీవ్రమైన చర్యలు తీసుకోబోమని బాంబే హైకోర్టుకు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేసుల నుంచి రక్షణ కల్పించాలంటూ రాణె పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమిత్‌ దేశాయ్‌ హాజరయ్యారు. కాగా, అరెస్ట్‌ సమర్థనీయమేనని మంగళవారం రాత్రి బెయిల్‌ సందర్భంగా మహాడ్‌ కోర్టు జడ్జి ఎస్‌ఎస్‌ పాటిల్‌ వ్యాఖ్యానించారు. కాగా, విచారణ నిమిత్తం సెప్టెంబర్‌ రెండున తమ ముందు హాజరవ్వాలని రాణెను నాసిక్‌ పోలీసులు నోటీసులు జారీచేశారు. చదవండి: అమెరికాలో ఆర్జనలో మన వారే టాప్‌

మరిన్ని వార్తలు