కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీ

17 Aug, 2020 02:14 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. పక్కన రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, భట్టి విక్రమార్క

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంచేసిందేమీ లేదు.. 

మౌలిక సదుపాయాల కల్పనలోనూ విఫలం  

నగర అభివృద్ధికి కేటాయించిన వేల కోట్లు ఏమయ్యాయి?  

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై టీపీసీసీ భేటీ.. చర్చ  

ఈ నెల 24లోపు డివిజన్‌ కమిటీల ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన సీఎల్పీ నాయకులు భట్టి విక్రమార్క, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీతో కలసి మీడియాతో మాట్లాడారు. హైదరా బాద్‌లో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవే, ఔటర్‌ రింగ్‌ రోడ్డు, కృష్ణా, గోదావరి మంచి నీరు, మెట్రో రైల్‌ తదితరాలన్నీ కాంగ్రెస్‌ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్‌ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఒక్క శాతం ప్రజలకైనా డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇచ్చారా అని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

హైదరాబాద్‌ అభివృద్ధికి కేటాయించిన వేల కోట్ల రూపాయలు ఎవరు తిన్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. త్వరలో జరిగే గ్రేటర్‌ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతుందని చెప్పారు. హైదరాబాద్‌లో డివిజన్ల విభజనలో అక్రమాలు జరిగాయని, కొంతమందికి లబ్ధి చేకూరేలా ఈ ప్రక్రియ జరిగిందని ఆరోపించారు. సచివాలయంలో మజీద్, మందిర్‌లను రాజ్యాంగ విరుద్ధంగా కూల్చేశారని, వాటిపై పోరాటాలు చేస్తామని తెలిపారు.   

పార్లమెంటులో ప్రస్తావిస్తాం: ఎంపీ రేవంత్‌ రెడ్డి చెప్పినట్టు మసీద్, మందిర్‌ కూల్చివేతల అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని ఉత్తమ్‌ చెప్పారు. కార్‌ స్టీరింగ్‌ తమ చేతిలో ఉందని, ఎంఐఎం పార్టీ నేతలు అంటున్నారని విమర్శించారు. మసీదు కూల్చివేతపై కేసీఆర్‌ నిర్ణయాన్ని అసదుద్దీన్‌ స్వాగతించడం దారుణమన్నారు. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందజేస్తామని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లి పోరాడతామని పేర్కొన్నారు. రాబోయే మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  

నిజాం ఆనవాళ్లను చెరిపేసే కుట్ర: రేవంత్‌ 
రాష్ట్రంలో నిజాం ఆనవాళ్లను ఒక్కొక్కటిగా చెరిపేసేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే సచివాలయం, ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నేలమట్టం చేశారని, చారిత్రక కట్టడాలను తొలగించి చరిత్రను చెరిపేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. మరోవైపు కేంద్రంలో కూడా హిందుత్వ ఎజెండాతో మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఆలయాల కూల్చివేతలపై బీజేపీ, ఎంఐఎంలకు మాట్లాడే అర్హత లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావోద్వేగాలను వాడుకుని రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. సచివాలయంలో గుడి, మసీదు కూల్చివేతపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

‘గ్రేటర్‌’ కసరత్తు షురూ!
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎ న్నికల కసరత్తును కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించింది. పక్కా ప్రణాళికతో ఈసారి ఎన్నికలను ఎదుర్కొనాలని, జీహెచ్‌ ఎంసీలో అతి పెద్ద పార్టీగా అవతరించేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నేతలు నిర్ణయిం చారు. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన అత్యవసర సమావేశం జరిగింది. సీఎల్పీ నే త భట్టి విక్రమార్క, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, గ్రేటర్‌ కాంగ్రెస్‌ నేతలు కిచ్చెన్న గారి లక్ష్మా రెడ్డి, ఫిరోజ్‌ఖాన్, విక్రమ్‌గౌడ్, అనిల్‌ కుమా ర్‌ యాదవ్‌లతో పాటు ఒకరిద్దరు మినహా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్య నాయకులు హాజరయ్యారు.

గ్రేటర్‌ ఎన్నికల వ్యూహంపై ఉత్తమ్‌ అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ నెల 24లోపు 150 డివిజన్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రేటర్‌ ఎన్నికలు నాలుగు నెలలలోపే జరుగుతాయని, ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీసం 3 నెలల సమయం ఉండేలా అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని ఉత్తమ్‌ సూచిం చినట్టు సమాచారం. కాగా, సెక్రటేరియట్‌ లో దేవాలయం, రెండు మసీదుల కూల్చివేతపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టాలని, ప్ర భుత్వంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాల ని, బీజేపీ, ఎంఐఎంల ద్వంద్వ వైఖరిని ఎం డగట్టాలని సమావేశం నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు