ఇద్దర్నే ఎందుకు కన్నారు మరి: మరో వివాదంలో సీఎం

22 Mar, 2021 11:45 IST|Sakshi

'రిప్డ్ జీన్స్'   వ్యాఖ్యల దుమారం తరువాత మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఇద్దర్ని కని ఎందుకు అసూయపడతారు, 20మందిని కనండి : ఉత్తరాఖండ్‌ సీఎం

ఎక్కువ రేషన్‌ కావాలంటే..  20 మంది పిల్లలు

ఈ రోజు హస్తినకు రానున్న తీరత్‌ సింగ్‌

సాక్షి, డెహ్రాడూన్‌: ఇటీవల సీఎం పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ నేత, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వరుస వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. 'రిప్డ్ జీన్స్' అంటూ మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న తీరత్‌ సింగ్‌, అమెరికా, మన దేశాన్ని 200 ఏళ్లు పాలించిందంటూ  వ్యాఖ్యానించి  విమర్శల పాలయ్యారు. వీటిన్నింటికి మించి  తాజాగా మరో  వివాదానికి తెరతీశారు. కోవిడ్ మహమ్మారి మధ్య తమను తాము పోషించుకోవడానికి కష్టపడుతున్న పేద కుటుంబాలకు ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు పంపిణీ చేసే కేంద్ర ప్రభుత్వ పథకం నుండి ఎక్కువ లబ్ది పొందాలంటే 20 మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాదు ఇద్దరు పిల్లలున్న మీరెందుకు అసూయపడతారు.. ఇరవైమందిని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. అటవీ దినోత్సవం సందర్బంగా రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఒక సమావేశంతో  ఉత్తరాఖండ్ సీఎం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ ‌మీడియాలో  చక్కర్లు కొడుతోంది. (ఉత్తరాఖండ్‌ సీఎం మరోసారి సంచలన వ్యాఖ్యలు..!)
 
కరోనా వైరస్, లాక్‌డౌన్ వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా నాణ్యమైన రేషన్ సరుకులను పేదవారికి కేంద్రం అందిస్తోంది‌ మనిషికి ఐదు కేజీల చొప్పున సరుకులు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలతో, నలుగురు సభ్యులున్న కుటుంబానికి 20 కేజీల సరుకులు దక్కుతుండగా, 20 మంది సభ్యులున్న కుటుంబానికి ఏకంగా క్వింటా సరుకులు లభిస్తున్నాయన్నారు. దీంతో ఎక్కువ సరుకులు పొందుతోన్న వారిపై చిన్నకుటుంబాల వాళ్లు అసూయతో రగిలిపోతున్నారంటూ విచక్షణా రహిత వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు  మీకు అసూయ..ఇద్దరు పిల్లల్నే కని ఆపేయడం ఎందుకు, 20 మంది పిల్లల్ని ఎందుకు కనలేదంటూ వ్యాఖ్యానించారు. 

నేడు హస్తినకు తీరత్‌
మరోవైపు తీరత్ సింగ్ రావత్ ఈ రోజు (సోమవారం) ఢిల్లీ చేరుకోనున్నారు. ఆయన నాలుగు రోజులు ఇక్కడే ఉండి ప్రధాని మోదీని హోంమంత్రి, ఇతర క్యాబినెట్ మంత్రులను కలువనున్నారు.

మరిన్ని వార్తలు