ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి బిగ్‌ షాక్‌.. ఇలా జరిగిందేంటి..?

10 Mar, 2022 17:41 IST|Sakshi

డెహ్రాడూన్‌ : ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ జూనియర్లు గెలుస్తూ సీనియర్లు ఓడిపోవడం పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. 

ఉత్తరాఖండ్‌ ఎన్నికల్లో అధికార బీజేపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఉత‍్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖతిమా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పుష్కర్‌ సింగ్‌ ధామి.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భువన్‌ కప్రీ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.  పుష్కర్ సింగ్ ధామీపై భువన్ చంద్ కప్రీ.. 6,951 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ధామికి 40,675 ఓట్లు రాగా.. భువన్ కప్రీకి 47,626 ఓట్లు వచ్చాయి.

మరోవైపు.. ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆధిక్యంగా ఉంది. 70 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ 48 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది.  ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ 18 చోట్ల విజయం సాధించింది.

మరిన్ని వార్తలు