దోషులను కఠినంగా శిక్షిస్తాం

7 Sep, 2020 05:06 IST|Sakshi
మోసపోయిన యువతితో మాట్లాడుతున్న వాసిరెడ్డి పద్మ, డీఎన్నార్‌

ప్రేమికుడి చేతిలో మోసపోయిన దళిత యువతికి రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పరామర్శ

టీడీపీ ప్రతి చిన్న ఘటననూ రాజకీయ లబ్ధికి వాడుకుంటోందని మండిపాటు

ముదినేపల్లి రూరల్‌ (కైకలూరు)/సాక్షి, అమరావతి: ప్రేమ పేరుతో దళిత యువతిని మోసం చేసిన యువకుడిని, అతడికి అండగా నిలుస్తున్నవారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. ప్రేమికుడి చేతిలో మోసపోయిన కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం ఐనంపూడికి చెందిన దళిత యువతిని ఆదివారం ఆమె ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌)తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా యువతి మోసపోయిన వైనం, ఇల్లును నిందితులు తగులబెట్టడం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ ఏమన్నారంటే..  

► యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. 
► యువతికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం సత్వరమే స్పందించి ఆర్థిక సాయం అందించడంతోపాటు అన్ని విధాలా అండగా నిలిచింది.
► రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాన్ని టీడీపీ రాజకీయం చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతోంది. 
► దళితులపై దాడులు చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. 
► కాగా, ప్రభుత్వం తమకు ధైర్యం ఇచ్చి అండగా నిలబడిందని బాధిత కుటుంబం సీఎంకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సీఎంవో అధికారులు ఆదివారం ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు