‘మాన్సాస్‌’ వ్యవహారంలో సుప్రీంకోర్టుకు వెళ్తాం 

15 Jun, 2021 04:01 IST|Sakshi

దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి 

సాక్షి, అమరావతి: మాన్సాస్‌ ట్రస్టు వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేస్తామని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ట్రస్ట్‌ పరిధిలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ట్రస్ట్‌ విషయంలో కోర్టు ఆదేశాలను పరిశీలిస్తున్నామన్నారు. ఏదైనా చట్టప్రకారమే అన్నీ జరుగుతాయని చెప్పారు. ఈ మేరకు సోమవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ట్విట్టర్‌ పిల్లాడు లోకేష్‌ ప్రతి దాంట్లో వేలు పెడతాడని.. మాన్సాస్‌ ట్రస్ట్‌ గురించి ఆయనకు ఏమి తెలుసని ప్రశ్నించారు.

లోకేష్‌ ఈ విషయం గురించి మాట్లాడటానికి అటు పిల్లాడు కాదు.. ఇటు పెద్దవాడు కాదని ఎద్దేవా చేశారు. ఒక కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వచ్చినంత మాత్రాన లోకేష్‌ గెలిచినట్టు కాదన్నారు. మాన్సాస్‌లో జరిగిన అక్రమాలను గుర్తించి చర్యలు చేపడుతున్నామన్నారు. ఏది చేసినా చట్టప్రకారం, న్యాయబద్ధంగా చేస్తామని తెలిపారు. బ్రహ్మంగారి మఠం విషయంలో చట్టప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్‌కు చేరాలన్నారు. పీఠాధిపతులతో కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రూల్స్‌ ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని తెలిపారు. శివస్వామి ముందుగా తన నిర్ణయం ప్రకటించడం సరికాదన్నారు. విషయం తేలే వరకు అక్కడ ఇన్‌చార్జ్‌ను నియమించామన్నారు.   

మరిన్ని వార్తలు