Vellampalli Srinivas: ఏడు నియోజకవర్గాలు గెలిచి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తా: వెల్లంపల్లి

20 Apr, 2022 11:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పలువురు నేతలు బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. బీజేపీ యువమోర్చా పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బోండా నిరీష్ కుమార్‌తో పాటు, పలు మండలాల కార్యకర్తలకు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 'పశ్చిమ నియోజకవర్గంలో వేట మొదలైంది. రాబోయే రోజుల్లో ఇతర పార్టీల నుంచి మరిన్ని చేరికలుంటాయి. పశ్చిమ నియోజకవర్గంలో ఇతర పార్టీల అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం. 2024కి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉండేది వైఎస్సార్‌సీపీ మాత్రమే. చంద్రబాబు అమరావతిలో కూర్చుని విజయవాడ అభివృద్ధిని గాలికొదిలేశాడు. జగన్‌మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాతే విజయవాడ అభివృద్ధి చెందింది.

చదవండి: (జీతం లేకుండా పనిచేయాలని ఏపీఐఐసీ ఛైర్మన్‌​ నిర్ణయం)

టీడీపీ హయాంలో ఇక్కడి నేతలు రోడ్లు కూడా వేయించుకోలేకపోయారు. టీడీపీ నేతల ఇళ్లముందు కూడా మేమే రోడ్లు వేయించాం. ఎంపీ కేశినేని నాని ఎందుకున్నాడో అర్థం కావడం లేదు. పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ ఇంఛార్జినని చెప్పుకుంటాడు. కేశినేనికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు. చంద్రబాబు వైశ్యులకు చేసిందేమీ లేదు. ఎన్నికల ఓటు బ్యాంకుగా వాడుకున్నాడే కానీ ఏనాడైనా వైశ్యులకు మేలు చేశారా. రోశయ్య బ్రతికున్నంత వరకూ వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు వైశ్యుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నాడు' అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. 

సీఎం జగన్‌కు కానుకగా ఇస్తా: వెల్లంపల్లి
'తొలి కేబినెట్‌లో నాకు దేవాదాయశాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. మూడేళ్లు ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చేశా. ఇప్పుడు పార్టీ బాధ్యతలు అప్పగించారు. ఎన్టీఆర్‌ జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో పార్టీ కోసం నా వంతుగా శక్తివంచన లేకుండా కృషిచేస్తా. వచ్చే ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలిచి సీఎం జగన్‌కు కానుకగా ఇస్తా' అని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు