సాక్షి, అమరావతి: పవన్ కల్యాణ్ ఏపీకీ గెస్ట్ ఆర్టిస్ట్ అని.. పొలిటీషియన్గా ఎవరూ అనుకోవటం లేదని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల క్రితం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని వేరే రాష్ట్రం వెళ్లిపోయిన పవన్, మళ్లీ ఇప్పుడు వచ్చి రైతు భరోసా యాత్ర అంటున్నాడని మండిపడ్డారు. చివరికి ఆ కార్యక్రమం పేరును కూడా మా పార్టీ నుంచి కాపీ కొట్టాడని ధ్వజమెత్తారు.
చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడని అందరికీ తెలుసు, ఇప్పుడు కూడా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే రైతు యాత్రలు చేస్తానంటున్నాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని చెబుతున్న పవన్.. ఇంకా బీజేపీతో ఎందుకు ప్రయాణం చేస్తున్నాడో చెప్పాలని ప్రశ్నించారు. పవన్కు అంత చిత్తశుద్ధి ఉంటే వెంటనే బీజేపీ నుంచి బయటకు రావాలని వెల్లంపల్లి శ్రీనివాస్ సవాల్ విసిరారు.