తప్పులు పట్టలేక టీడీపీ కులాల ప్రస్తావన

11 Aug, 2022 04:07 IST|Sakshi

లేని వివాదాలు చూపించి పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తోంది

కలిసి ఉంటున్న ప్రజల మధ్య విష బీజాలు నాటుతున్నారు 

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎటువంటి వివక్ష లేకుండా సామరస్యంతో కలిసిమెలిసి ఉంటున్న ప్రజల మధ్య కులం, మతం అంటూ విష బీజాలు నాటి పబ్బం గడుపుకోవాలని టీడీపీ చూస్తోందని వైఎస్సార్‌పీపీ నేత, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీలో పాలక పక్షమైన వైఎస్సార్‌సీపీ నేతలు రాష్ట్రంలో కులమతాల చిచ్చు పెట్టాలని చూస్తున్నారని టీటీడీ నేత చంద్రబాబు అంటుంటే, ఆయన పుత్రరత్నం లోకేష్‌ ఒకడుగు ముందుకేసి సీఎం జగన్‌ పెత్తనం మొత్తం ఒక సామాజికవర్గానికి అప్పజెప్పారని రంకెలు వేయడం సిగ్గుచేటు అని బుధవారం ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై తప్పుపట్టడానికి కారణాలేవీ కనిపించని పచ్చ పార్టీ నేతలు కులం ప్రస్తావనతో ప్రభుత్వం పైన, సీఎం జగన్‌ పైన అవాకులు చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

టీడీపీ రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన పర్యటన అనుభవం పేరుతో ఏపీ రాజకీయాలకు కుల విశ్లేషణ జోడిస్తున్నారని అన్నారు. సీఎం కులం వారికే ఎక్కువ మేలు జరుగుతోందని అదే పార్టీకి చెందిన కొందరు నేతలంటుంటే.. జగన్‌ కులం వారూ అసంతృప్తితో ఉన్నారని బుచ్చయ్య వంటి వృద్ధ నేతలు వెల్లడించడం చంద్రబాబు పార్టీలోని గందరగోళానికి అద్దం పడుతోందన్నారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎలా వ్యవహరించాలో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు ఎవరైనా అమరావతిలో శిక్షణ ఇస్తే ఐదు కోట్ల మంది ఆంధ్రులకు మేలు జరుగుతుందని విజయసాయిరెడ్డి హితవు పలికారు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో విజయసాయిరెడ్డి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయిన విజయసాయిరెడ్డి తిరుమల శ్రీవారి ప్రతిమను బహూకరించారు. అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం మహాత్మాగాంధీ స్మృతి స్థల్‌ను సందర్శించిన విజయసాయిరెడ్డి గాంధీజీకి నివాళులర్పించారు.  

మరిన్ని వార్తలు