విశాఖ నగరాభివృద్ధి సీఎం జగన్‌తోనే సాధ్యం

27 Feb, 2021 05:09 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

పార్టీలో చేరిన 250 మందికిపైగా టీడీపీ నేతలు, కార్యకర్తలు 

సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరాభివృద్ధి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో మాత్రమే సాధ్యమని, అందుకే వివిధ పార్టీల నుంచి తమ పార్టీలో చేరుతున్నారని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్న పార్టీ కార్యాలయంలో శుక్రవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో 11, 14, 24, 27వ వార్డులకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు 250 మందికిపైగా వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరందరికీ విజయసాయిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా చేరిన వారితో కలిసి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని సీఎం వైఎస్‌ జగన్‌కు బహుమతిగా ఇవ్వాలని కోరారు. పార్టీ కోసం శ్రమించిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రోజురోజుకూ టీడీపీ బలహీనపడుతోందని, నగరంలో పూర్తిగా కనుమరుగయ్యే స్థితికి చేరిందని చెప్పారు. గత వారం రోజులుగా టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్‌సీపీలో చేరుతుండటం శుభపరిణామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, విశాఖ నార్త్‌ పరిశీలకుడు రవిరాజు, పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి రవిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు