Vijaya Sai Reddy On Chandrababu: ఉద్యోగాలు ఊడగొట్టిన ఘనుడు బాబు

25 Jun, 2022 02:38 IST|Sakshi
సీబీఐటీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి, చిత్రంలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి తదితరులు

ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించిన గొప్ప వ్యక్తి సీఎం జగన్‌

నేడు సీబీఐటీలో 120 కంపెనీలు, 10వేల ఉద్యోగాలతో వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా

నిరుద్యోగులు వినియోగించుకోవాలని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపు

చాపాడు: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 60 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి, ఉద్యోగాలు ఇవ్వకుండా.. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టిన అభినవ పులకేశి చంద్రబాబు అని రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. మరోవైపు.. మూడేళ్లలో అన్ని రంగాలు అభివృద్ధి చెందేలా ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.

వైఎస్సార్‌ జిల్లా చాపాడు సమీపంలోని సీబీఐటీ ఇంజనీరింగ్‌ కాలేజీలో 120 ప్రముఖ కంపెనీలలో 10వేల ఉద్యోగాలు కల్పించేలా శనివారం వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ ప్రభుత్వం లక్షలాది మందికి, వైఎస్సార్‌సీపీ ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నారన్నారు.

ఇంత చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేయటం, అలాగే.. ఎమ్మెల్యేగా గెలువలేని, పప్పుతిని పడుకునే వ్యక్తి సవాళ్లు చేయటం మానుకోవాలని హితవు పలికారు. ఇక వైఎస్సార్‌ జిల్లాలోని నిరుద్యోగులందరూ జాబ్‌మేళాను వినియోగించుకోవాలని, ఎంపికవని వారికి శిక్షణనిచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

ఒక ఎస్టీ మహిళను రాష్ట్రపతిని చేసేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ సమ్మతించటం గొప్ప విషయమన్నారు. సమావేశంలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌ మల్లికార్జునరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు