విశాఖపై చంద్రబాబు విషం

17 Aug, 2020 07:02 IST|Sakshi

అధికారంలో ఉన్నపుడు  జిల్లాను పట్టించుకోలేదు 

విశాఖలో ప్రాజెక్టులన్నీ వైఎస్సార్‌ చలవే 

ఇపుడు అమరావతి కోసం విశాఖపై కుట్రలు  

విశాఖ సర్వతోముఖాభివృద్ధికి 

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ చర్యలు 

త్వరలో నగరంలో మెట్రో, ట్రామ్‌ కారిడార్లు,  భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ పనులు ప్రారంభం  

దొండపర్తి (విశాఖ దక్షిణ): అమరావతిపై ప్రేమతో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు విశాఖపై విషం చిమ్ముతున్నాడని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు.. 

విభిన్న సంస్కృతుల ప్రజలతో మినీ భారత్‌ను తలపిస్తున్న విశాఖ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  
విశాఖ సర్వతోముఖాభివృద్ధికి సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు కుటిల రాజకీయాలు, లిటిగేషన్ల పేరుతో అడ్డుకుంటున్నారు.  
ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఉన్నపుడు హైదరాబాద్‌ భూములపై కన్నేసినట్లే.. తర్వాత అమరావతిని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌గా మార్చారు.  చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో అమరావతి గ్రాఫిక్స్‌ చూపించి కాలయాపన చేసి అందరినీ మాయచేశారు. 
పెట్టుబడుల సదస్సుల పేరుతో చేసిన వందల కోట్ల ఖర్చులో సగం కూడా పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు.   
జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నడూ లేని విధంగా విశాఖ నగరాభివృద్ధి కోసం రూ.1300 కోట్లు కేటాయించారు. 
విశాఖలో ప్రైవేటు యూనివర్సిటీ కోసం.. ప్రజా యూనివర్సిటీగా వర్ధిల్లుతున్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టనుమసకబార్చారు. 
14 ఏళ్లుగా సీఎంగా చేసినపుడు చంద్రబాబు ఎప్పుడూ విశాఖను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉత్తరాంధ్ర టీడీపీ అడ్డా అంటూ చెప్పకోవడం మినహా చేసింది ఏమీ లేదు. రాష్ట్ర విభజన తరువాత కూడా అభివృద్ధిని కాగితాలకే పరిమితం చేసి, ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో మీటింగ్‌లకే పరిమితం చేశారు.  
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు.. హోదా కోసం ఎవరైనా మాట్లాడితే జైల్లో పెడతానంటూ బెదిరించారు. 
విశాఖకు ఐటీ కారిడార్‌ను తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డే. ఆయన అధికారంలో ఉన్నపుడు 18 వేల మంది విశాఖలో ఐటీ పరిశ్రమలో పనిచేసేవారు. 
ఆయన మరణం తరువాత ఐటీ పరిస్థితి విశాఖలో దిగజారింది. 
విశాఖలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నుంచి బీఆర్‌టీఎస్‌ రోడ్లు, 14 కొత్త కాలనీలు, ఏపీ సెజ్‌ ఏర్పాటు, బ్రాండిక్స్‌ కంపెనీ, తద్వారా వేలాది మంది ఉద్యోగావకాశాలు ఇవన్నీ వైఎస్‌ఆర్‌ చలవే. 
చంద్రబాబు మాత్రం విశాఖలో భూములు దోచుకొని బినామీలకివ్వడం, హుద్‌హుద్‌  పేరు చెప్పి రికార్డులు మాయ చేయడం వంటివి చేశారు. 
విశాఖ జిల్లాలో అపార ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అడ్డువచ్చిన వారిని మావోయిస్టు అని, రౌడీషీటర్‌ అని ముద్రవేసేవారు. 
అటువంటి తప్పులు సరిదిద్దడంతో పాటు విశాఖ జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి  జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు చేపడుతున్నారు.      విశాఖలో మెట్రో, ట్రామ్‌ కారిడార్ల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.   
పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

మరిన్ని వార్తలు