బీసీల సర్వతోముఖాభివృద్ధికే 56 కార్పొరేషన్‌లు

12 Nov, 2020 04:01 IST|Sakshi

ఏడాదిన్నరలో వారికి రూ.25 వేల కోట్ల లబ్ధి 

వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి 

సాక్షి, విశాఖపట్నం: బీసీలంటే సీఎం వైఎస్‌ జగన్‌కి ఎంత ప్రేమో ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూస్తే అర్థమవుతుందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్ర గవర కులస్తుల అభ్యున్నతికి కృషిచేసినందుకుగాను సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో బుధవారం గవర వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేసేందుకు ఏ రాష్ట్రంలో లేని విధంగా 56 బీసీ కులాలకు కార్పొరేషన్‌లు ఏర్పాటుచేశారని కొనియాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో 2 కోట్ల మందికి పైగా బీసీలకు దాదాపు రూ.25 వేల కోట్ల లబ్ధి చేకూర్చినట్టు తెలిపారు.

బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు 
బీసీ డిక్లరేషన్‌ పేరుతో చంద్రబాబు బీసీలను దగా చేశారని, వారితో ఓట్లేయించుకుని గద్దెనెక్కాక వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. బీసీలంతా వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటూ మరో 25 ఏళ్ల పాటు జగన్‌ను సీఎంను చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యేలు అమర్‌నా«థ్, గొల్ల బాబూరావు, కరణం ధర్మశ్రీ, పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు