కోవిడ్ ప్యానెల్ నుంచి తప్పుకున్న టాప్ వైరాలజిస్ట్

17 May, 2021 11:33 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు చెందిన వివిధ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శాస్త్రీయ సలహా బృందం నుంచి సీనియర్ వైరాలజిస్ట్ షాహీద్ జమీల్‌ తప్పుకున్నారు. కోవిడ్ రెండో దశను అరికట్టే విషయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయాలను ప్రశ్నించిన కొద్ది రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. జమీల్‌ ఇండియన్ సార్స్-కోవ్-2 జినోమిక్ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం (ఐఎన్ఎస్ఏసీఓజీ) లో సభ్యుడిగా ఉన్నారు. రాజీనామా అనంతరం ‘నేను సరైన నిర్ణయమే తీసుకున్నా.. కానీ దీనిపై మాట్లాడటానికి ఇంకేం లేదు. రాజీనామాపై ఎటువంటి కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు.’ అని రాయిటర్స్ వార్తా సంస్థకు తెలిపారు.

కాగా ఈ అంశంపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రెటరీ రేణూ స్వరూప్ స్పందించడానికి విముఖత చూపారు. ఇక ఇటీవల ‘భారత్‌లోని శాస్త్రవేత్తలు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి వైఖరితో కూడిన ప్రతిస్పందనను ఎదుర్కొంటున్నారని డాక్టర్ జమీల్ న్యూయార్క్ టైమ్స్‌కు రాసిన ఆర్టికల్‌లో పేర్కొన్నారు. దేశంలో కోవిడ్ నిర్వహణ ముఖ్యంగా తక్కువ సంఖ్యలో టెస్టింగ్, వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ కొరత, హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ అతి తక్కువ స్థాయిలో ఉండడం వంటి కారణాలే భారత్‌లో కోవిడ్‌ వ్యాప్తికి దోహదపడుతున్నాయని విమర్శించారు. 

ఈ చర్యలన్నింటికీ భారతదేశంలోని తన తోటి శాస్త్రవేత్తలలో విస్తృత మద్దతు ఉంది. కానీ వారు సాక్ష్యాధారిత విధాన రూపకల్పనకు మొండి పట్టుదలను ఎదుర్కొంటున్నారుని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ప్రధాన మంత్రికి ఏప్రిల్ 30న 800 మంది భారతీయ శాస్త్రవేత్తలు విజ్ఙప్తి చేసినట్లు తెలిపారు. భారత్‌లో మహమ్మారి నియంత్రణలో లేనందున డేటా ఆధారంగా నిర్ణయం తీసుకోవడం మరో ప్రమాదమేనని, మహమ్మారిని అదుపు చేయలేకపోతే శాశ్వత మచ్చగా మిగిలిపోతుందన్నారు. తమ పరిశోధనల ఫలితాలపై ప్రభుత్వం పెద్దగా దృష్టిపెట్టకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.

చదవండి: కరోనా వచ్చి పోయినా జలుబు తగ్గట్లేదు.. బ్లాక్‌ ఫంగసా?

మరిన్ని వార్తలు