ఫార్మాసిటీని రద్దు చేస్తాం 

22 Sep, 2020 03:33 IST|Sakshi

దళిత, గిరిజన, పేదల భూములను బలవంతంగా లాక్కుంటారా?

బహుళజాతి సంస్థలకు భూములివ్వడం ప్రజాప్రయోజనమా?: సీఎల్పీ నేత భట్టి  

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మాసిటీ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక బ్రోకరేజ్‌ వ్యవస్థలా మార్చిందని, తాము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీని రద్దు చేస్తామని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేసీఆర్‌ ముఖ్యమంత్రిలా కాకుండా ఒక దళారీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమిని పంచుతామని చెప్పిన కేసీఆర్, ఫార్మాసిటీ పేరుతో దళిత, గిరిజన, పేదల భూములను ఎలా లాక్కుంటారని ప్రశ్నించారు.

సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వరంగ సంస్థల కోసం భూసేకరణను తాము తప్పుబట్టబోమని, కానీ ఫార్మాసిటీ పేరుతో అమెరికా సంస్థలకు, ఎంఎన్‌సీలకు భూములను కట్టబెట్టడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. బహుళజాతి సంస్థలకు భూములు ధారాదత్తం చేయడం ప్రజాప్రయోజనం ఎలా అవుతుం దో అర్థం కావడం లేదన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 2 ల క్షల 60 వేల ఇండ్లు నిర్మిస్తామని కేసీఆర్, లక్ష ఇళ్లు నిర్మి స్తాం అంటూ కేటీఆర్‌ అసెంబ్లీలో చెప్పిన వీడియో క్లిప్‌ల ను భట్టి మీడియాకు చూపించారు. కానీ మంత్రి తలసాని తమకు 3,428 ఇండ్లు మాత్రమే చూపించారని ఎద్దేవా చేశారు. గత గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధిం చిన టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ఆ పార్టీ వెబ్‌సైట్‌ నుంచి తీసేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. గ్రేటర్‌ ప్రజలు టీఆర్‌ఎస్‌ మాటలకు మరోసారి మోసపోవద్దని భట్టి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు