కోల్కతా : భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆదివారం ‘సంకల్ప్ పత్ర’ పేరుతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేనిఫెస్టోపై ఆయన మాట్లాడుతూ.. ‘‘ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం. బెంగాల్ సరిహద్దు ప్రాంతాలను బలోపేతం చేస్తాం. బెంగాల్లోకి చొరబాటుదారులు రాకుండా నియంత్రిస్తాం. తొలి కేబినెట్ భేటీలోనే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. బెంగాల్లో 70 ఏళ్ల నుంచి ఉంటున్న శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తాం. ప్రతి శరణార్థ కుటుంబానికి ఏటా రూ.10 వేల చొప్పున ఐదేళ్లపాటు ఇస్తాం.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను కొనసాగిస్తాం. ఎలాంటి కోతలు లేకుండా రైతుల ఖాతాల్లోకే నేరుగా నగదు జమ చేస్తాం. మహిళలకు కేజీ నుంచి పీజీ విద్యను ఉచితంగా అందిస్తాం. నార్త్ బెంగాల్, జంగల్మహల్, సుందర్బన్లో 3 ఎయిమ్స్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తాం. వైద్యం కోసం కోల్కతా వెళ్లే అవసరం లేకుండా ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మిస్తాం’’ అని అన్నారు.