కాపురంలో పొలిటికల్‌ నిప్పులు; ఆయన్నింకా ప్రేమిస్తున్నా

23 Dec, 2020 14:38 IST|Sakshi

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లో భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టిన పొలిటికల్‌ డ్రామా ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం విడాకుల వరకు దారితీసింది. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్‌ సభ్యులు సౌమిత్రా ఖాన్‌ భార్య సుజాతా మండల్‌ ఖాన్‌ సోమవారం తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తన భార్య సుజాతా ఖాన్‌ పార్టీ మారడంపై స్పందించిన భర్త సౌమిత్రా ఖాన్ ఆమె పార్టీ మారినందుకు తమ పదేళ్ల వివాహిక బంధాన్ని తెంపేసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. త్వరలోనే విడాకుల కోసం దరఖాస్తు చేసుకుంటానని, ఇక ముందు తన భార్య తన ఇంటి పేరును వాడుకోరాదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా మరో నాలుగు నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్ననేపథ్యంలో భార్యాభర్తల పొలిటికల్‌ డ్రామా చర్చనీయాంశంగా మారింది.

తాజాగా భర్త నిర్ణయంపై సుజాత స్పందించి మంగళవారం మీడియా ముందుకు వచ్చారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ఓ పార్టీయే (బీజేపీ) నాకు విడాకులివ్వాలని నా భర్తను కోరుతోంది అని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను పార్టీ మారినందుకే నా భర్త విడాకులు ఇస్తానని అంటున్నాడు. ఇందుకు ఆయనను బీజేపీ నేతలే రెచ్ఛగొడుతున్నారు. వారిలో ఒక్కరైనా ఆయనను ఎందుకు అడ్డుకోవడంలేదు.  ఇది మంచిది కాదని ఆయనకు ఎందుకు నచ్ఛజెప్పడంలేదు. కానీ నేను ఆయన్ను ఇంకా ప్రేమిస్తున్నాను’. అని పేర్కొన్నారు. అయితే  పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన రాజకీయ పార్టీలు మాత్రం ఈ విషయంపై నోరుమెదపకుండా జరుతున్న తతంగాన్ని చూస్తూ కూర్చున్నాయి.  చదవండి: మాటల యుద్ధం.. ఆ దమ్ముందా: ప్రశాంత్

కాగా బెంగాల్‌‌లోని బిష్ణూపూర్‌ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన సౌమిత్రా ఖాన్‌ భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.  2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో భర్తను గెలిపించుకునేందుకు ఎంతో కష్టపడినప్పటికీ బీజేపీలో తనకు తగిన గుర్తింపు రాకపోవడంతో తాను పార్టీ మారాల్సి వచ్చిందని సుజాతా మండల్‌ ఖాన్‌ ఆరోపించారు. ఎప్పటి నుంచో పార్టీకి విధేయంగా పని చేస్తున్న తమ లాంటి వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అవినీతి పరులకు గుర్తింపు ఇస్తుండడంతో విధిలేని పరిస్థితుల్లో తాను పార్టీ మారానని ఆమె వివరించారు. ఇప్పటికీ బీజేపీలో కొనసాగుతోన్న ఆమె భర్త గురించి ప్రశ్నించగా, అది ఆయన ఇష్టమని, ఏదోరోజున వాస్తవాలను గుర్తించి తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరినా చేరిపోవచ్చని ఆమె చెప్పారు.

మరిన్ని వార్తలు