కోల్కతా: పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికల జోరు మొదలయ్యింది. ఈ నెల 30న జరగనున్న భవానీపూర్ ఉప ఎన్నిక బరిలో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీదీకి ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల బరిలో బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్ బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించినప్పటికి.. మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో మమత తప్పనిసరిగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. ఈ క్రమంలో మమత కోసం భవానీపూర్ స్థానంలో గెలిచిన శోవన్దేబ్ చటర్జీ రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ స్థానం నుంచి దీదీ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భవానీపూర్ మమతకు కంచుకోట.
(చదవండి: మమతా బెనర్జీకి తాడోపేడో: భవానీపూర్ నుంచే పోటీ)
పశ్చిమ బెంగాల్లోని భవానీపూర్తో పాటు శంశేర్గంజ్, జాంగిపూర్ నియోజకవర్గాలకు సెప్టెంబర్ 30వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికకు 13వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరిస్తుండగా.. 16వ తేదీ ఉపసంహరణ. అక్టోబర్ 3న ఫలితాలు ప్రకటించనున్నారు.
చదవండి: మమతా బెనర్జీపై పోటీకి ప్రియాంకా