టీఎంసీ నన్ను చంపాలని చూస్తోంది: బీజేపీ ఎంపీ

15 Sep, 2021 10:18 IST|Sakshi

సాక్షి, కోల్‌కతా: టీఎంసీ నేతలు తనను చంపాలని చూస్తున్నారంటూ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆరోపణలు చేశారు. ఆయన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలో మంగళవారం ఉదయం 9.10 గంటలకు బాంబు పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 8న కూడా బెంగాల్‌లోని నార్త్‌ 24 పరగణాస్‌లో ఉన్న ఆయన ఇంటి వెలుపల ఓ పేలుడు సంభవించింది. కొందరు వ్యక్తులు ఆయన ఇంటి గేటుపై బాంబులు విసిరారు.ఈ కేసు విచారణను ప్రస్తుతం ఎన్‌ఐఏ చూస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది.

పేలుడు అనంతరం ఆయ మాట్లాడుతూ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈ దాడులు వెనుక ఉందని ఆరోపించారు. తనను, తన సన్నిహితులను చంపేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. బెంగాల్‌లో ప్రస్తుతం గూండారాజ్యం నడుస్తోందని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను నార్త్‌ 24 పరగణాస్‌ అధ్యక్షుడు పార్థ భౌమిక్‌ ఖండించారు. ఆయా పేలుళ్లకు బీజేపీ ఎంపీనే ఏదో ఒక రకంగా కారణమైఉంటారని అన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోందని, అధికారులు ఘటనా స్థలంలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

చదవండి: బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ రేవంత్‌

మరిన్ని వార్తలు