ఎన్నికల వేడి: బీజేపీలో చేరిన సినీ నటి

2 Mar, 2021 08:52 IST|Sakshi

బీజేపీ తీర్థం పుచ్చుకున్న బెంగాలీ సినీ నటి స్రబంతి ఛటర్జీ

అధికారం కోసం ఉవ్విళ్లూరుతున్న బీజేపీ

మూడోసారి  సీఎం పీఠం దక్కించుకోవాలనేది దీదీ ప్లాన్‌

సాక్షి,కోలకతా: పశ్చిమ బెంగాల్‌ రాజకీయాలు రోజు రోజుకు ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోరుకు తెరలేచిన తరుణంలో టీఎంసీ కంచు కోటలో పాగా వేసి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటికే  పలువురు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల్ని పార్టీలో కలుపుకున్న బీజేపీ మరింత వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో తాజాగా బెంగాలీ సినీ నటి స్రబంతి ఛటర్జీని తమ పార్టీలోకి ఆహ్వానించింది. సోమవారం ఆమె కోల్‌కతాలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్‌ విజయ్‌ వర్గియా, బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ సమక్షంలో స్రబంతి  ఛటర్జీ పార్టీలో చేరారు. 

రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం పీఠంపై కన్నేసిన బీజేపీ 294 మంది సభ్యుల అసెంబ్లీలో  కనీసం 200 సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటు తృణమూల్ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా వరుసగా మూడోసారి పదవిని దక్కించుకోవాలని చూస్తున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మార్చి 27 నుండి ఎనిమిది దశల్లో జరుగుతాయి. చివరి రౌండ్ ఓటింగ్ ఏప్రిల్ 29 న జరుగునుండగా,  ఓట్ల లెక్కింపు మే 2 న  ఉంటుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో మోడల్ ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది.

>
మరిన్ని వార్తలు