మోదీజీ.. దీదీ గెలిస్తే.. మీరు ఓడినట్లే: సంజయ్‌ రౌత్‌

2 May, 2021 15:32 IST|Sakshi

ముంబై: మే 2 తర్వాత మహరాష్ట్రలో రాజకీయ పరిణామాలు మారతాయని వాదించిన వాళ్లు పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలో ప్రకంపనలు వస్తాయని గుర్తుంచుకోవాలంటూ  శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
  
పశ్చిమ బెంగాల్‌లో 292 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ, హోమంత్రి అమిత్‌ షాలు ప్రచారం నిర్వహించారు. ఆ ఇద్దరు ఉద్దండుల ప‍్రచారంతో బెంగాల్‌ రాజకీయ ముఖ చిత్రం మారిపోనుందని రాజకీయ నిపుణులు భావించారు. ఇప్పటి వరకు దేశంలో జరిగిన అన్ని ఎన్నికల్లో బీజేపీ ఎలా అయితే విజయం సాధించిందో.. బెంగాల్‌లో సైతం అదే తరహాలో దీదీని మట్టికరిపిస్తూ బీజేపీ విజయ దుందుభి మోగిస్తోందని సొంత పార్టీల నేతలు, అభ్యర్ధులు ఊహించారు.  

కానీ నేటి ఓట్ల లెక్కిపు ప్రక్రియలో బీజేపీ నాయకుల అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ఎన్నికల ప్రచారంలో గాయ పడ్డ మమత ఒంటికాలితో ప్రచారం నిర్వహించి విజయం సాధిస్తానని ప్రత్యర్ధులకు విసిరిన సవాల్‌ నిజమయ్యింది. ఈ క్రమంలో సంజయ్‌ రౌత్‌ శివసేన అధికార మీడియా 'సామ్నా' వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

మే 2 తర్వాత మహారాష్ట్రలో రాజకీయ మార్పులు జరుగుతాయని ప్రచారం చేసిన వారు.. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలు ఢిల్లీలో కూడా ప్రకంపనల సృష్టిస్తాయని గుర్తించుకోవాలన్నారు. ఓ వైపు దేశంలో కోవిడ్‌ విజృంభణ కొనసాగుతుంది. వ్యాక్సిన్లు, బెడ్ల కొరత, ఆక్సిజన్‌ లేకపోవడం వల్ల 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు చనిపోతున్నా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయం చేయడం ఎంతవరకు సమంజసం అని సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు.

 ఒక్క రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో గెలిచేందుకు దేశ ప్రజల్ని ప్రమాదంలోకి నెట్టేశారు. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని, ఈసీ తీరుపై మద్రాస్‌ హైకోర్టు మండిపడిందని సంజయ్‌ రౌత్‌ గుర్తు చేశారు. అంతేకాదు వెస్ట్‌ బెంగాల్‌లో దీదీ గెలిస‍్తే అక్కడ ప్రచారం చేసిన మోదీ, అమిత్‌ షాలు సైతం ఓడినట్లేనని సంజయ్‌ రౌత్‌ సామ్నాలో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు