Arvind Kejriwal: పంజాబ్‌లో మహిళలు సంతోషంగా లేరు : కేజ్రీవాల్‌

28 Jun, 2021 16:48 IST|Sakshi

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కసరత్తు ముమ్మరం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌.  హామీలతో ఇప్పటినుంచే పంజాబ్‌ ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తున్నారు. రేపు చంఢీఘర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ఢిల్లీలో మేము ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నాము. మహిళలు సంతోషంగా ఉన్నారు. పంజాబ్‌లోని మహిళలు ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ వచ్చే పంజాబ్‌ ఎన్నికల్లో గెలిచి, అధికారంలోకి వస్తే అందరికీ ఉచిత విద్యుత్‌ అందిస్తా. రేపు చంఢీఘర్‌లో కలుద్దాం’’ అని పేర్కొన్నారు.

కాగా, రేపు చంఢీఘర్‌లో ముందుగా నిర్ణయించుకున్న వేదికలో జరగబోయే కేజ్రీవాల్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు పంజాబ్‌ సీఎం ఆఫీసు పర్మీషన్‌ నిరాకరించిందని ఆప్‌ అధికార ప్రతినిధి, ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్‌ చద్దా తెలిపారు. కేజ్రీవాల్‌ రేపు(మంగళవారం) చంఢీఘర్‌లో మెగా అనౌన్స్‌మెంట్‌ చేయనున్నారని, దీంతో పంజాబ్‌ ముఖ్యమంత్రికి, ఆయన పార్టీకి 440 ఓల్టుల కరెంట్‌ తగులుతుందని ట్విటర్‌ వేదికగా పేర్కొన్నారు.

చదవండి : కేజ్రీవాల్‌పై విరుచుకుపడ్డ మనీశ్‌ సిసోడియా! జరిగింది ఇది..

>
మరిన్ని వార్తలు