దిగజారుడుకు పరాకాష్ట కాక ఇంకేమనుకోవాలి? రామోజీ..

2 Aug, 2022 12:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చంద్రబాబు ప్రభుత్వం వేలం నిర్వహించకుండా లైసెన్సులిచ్చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ–వేలం నిర్వహించి లైసెన్సులు కేటాయించింది. ఎవరిది పారదర్శకత?

బాబు హయాంలో 840 బార్లకు లైసెన్సులివ్వటం ద్వారా ప్రభుత్వానికి వచ్చింది ఏడాదికి రూ.289 కోట్లు. ఇప్పుడు 815 బార్లకు వేలంలో లైసెన్సులిస్తే వచ్చింది ఏకంగా రూ.597.35 కోట్లు. మరి ఎవరి హయాంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చినట్లు? 

ఇక్కడ చెప్పాల్సిందేమిటంటే... చంద్రబాబు హయాంలో అడ్డగోలుగా తమ పార్టీ నేతలకు పంచేశారు. దోచుకో–పంచుకో–తినుకో (డీపీటీ) అనే తమ పాలసీలో భాగంగా బార్ల లైసెన్సుల్ని దోచుకున్నారు. ఇప్పుడేమో పారదర్శకంగా ఈ–వేలం నిర్వహించడంతో పోటీ పెరిగింది. ఎక్కువ మంది పాల్గొన్నారు. అందుకే ప్రభుత్వానికి అప్పటికన్నా రెట్టింపును మించి ఆదాయం వచ్చింది. కాకపోతే అప్పట్లో కేటాయింపులపై పెన్నెత్తని రామోజీరావు... ఇప్పుడు మాత్రం ‘కూడబలుక్కుని’ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు లైసెన్సులు పంచేసుకున్నారని రాయటం దిగజారుడుకు పరాకాష్ట కాక ఇంకేమనుకోవాలి? ఒకవంక ఈ ప్రభుత్వానికి బార్ల కేటాయింపుల ద్వారా ఎక్కువ డబ్బులు వస్తున్నాయని రాస్తూ... పోటీ వల్లే అంత వచ్చిందనే విషయాన్ని వదిలిపెట్టి, అంతా కుమ్మక్కయిపోయారని రాయటం ఏ మార్కు జర్నలిజం? అసలు మీ పాఠకులంటే మీకు అంత చులకనగా ఉందా రామోజీరావుగారూ?

ఈ ప్రభుత్వ హయాంలో ఆదాయం పెరిగింది తప్ప ఒక్కటంటే ఒక్క బార్‌ కూడా పెరగలేదు. . అధికారంలోకి వస్తూనే వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఒక్క బెల్టు షాపు కూడా ఉండటానికి వీల్లేదనే కృతనిశ్చయంతో ఆ వ్యవస్థనే లేకుండా చేశారు. మద్యం దుకాణాల్లో వాటికి అనుబంధంగా నడిచే పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. దుకాణాల సంఖ్యను గణనీయంగా తగ్గించి, ప్రభుత్వ నియంత్రణలో... నిర్ణీత వేళలు పాటిస్తూ అమ్మకాలు జరిపేలా నిర్దేశించారు. మొత్తంగా మద్యం లభ్యమయ్యే సమయాన్ని తగ్గించారు. తాగేవారు వెనకడుగు వేసేలా మద్యం ధరలు కూడా పెంచారు. ఇన్ని చర్యలు తీసుకున్నా... ‘ఈనాడు’ మాత్రం మద్యం విషయంలో రోజూ పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. ప్రభుత్వంపై విషం చిమ్ముతూనే ఉంది.

బాబు లైసెన్స్‌ ఇవ్వాలంటే....
టీడీపీ ప్రభుత్వం 2017లో రాష్ట్రంలో బార్‌ లైసెన్సుల జారీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలన్న కనీస విధానాన్ని కూడా పాటించ లేదు. అప్పటికే కాలపరిమితి ముగిసిన బార్ల యజమానులకే మళ్లీ లైసెన్సులను రెన్యూవల్‌ చేసేశారు. వేలం లేకుండా లైసెన్సులు మరో ఐదేళ్లు పొడిగించినందుకు అప్పటి 747 బార్ల యజమానులు భారీగా ముట్టజెప్పారనేది టీడీపీలో అప్పట్లో బహిరంగ రహస్యం.  అదే ఏడాది కొత్తగా అనుమతి ఇచ్చిన మరో 84 బార్లదీ అదేతీరు. అతి తక్కువ అప్‌సెట్‌ ధరను ప్రభుత్వమే నిర్ణయించి... వాటికి బిడ్లు వేసిన వారిని లాటరీ ద్వారా ఎంపిక చేసేశారు. అలా 2017లో టీడీపీ ప్రభుత్వం 840 బార్లకు ఏకంగా ఐదేళ్లకు లైసెన్సులు జారీ చేసింది.  2019లో తమ ప్రభుత్వం పోయినా సరే టీడీపీ తమ్ముళ్ల బార్ల దందా అడ్డులేకుండా సాగాలనే కుతంత్రం ఆయనది. వీటిద్వారా 2021–22లో ప్రభుత్వానికి వచ్చింది కేవలం రూ.289.14కోట్లు.

ఇప్పుడు పారదర్శకంగా ఈ–వేలం... అందుకే పోటీ
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తూ కొత్త బార్‌ పాలసీని ప్రకటించింది. బార్ల సంఖ్యను పెంచలేదు. గతంలో ఉన్న 840 బార్లకే పరిమితమైంది. ఇక ఏకపక్షంగా బార్ల లైసెన్సులు కేటాయించకుండా నోటిఫికేషన్‌ జారీ చేసింది. తద్వారా బార్ల లైసెన్సు కోసం ఎవరైనా సరే పోటీ పడేందుకు అవకాశం కల్పించింది. అంతేకాదు బార్ల లైసెన్సుల కేటాయింపునకు ఇ–వేలం ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. అంటే దరఖాస్తు సమర్పించినప్పటి నుంచి వేలంలో బిడ్ల దాఖలు వరకూ కూడా ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్లోనే నిర్వహించింది. ఎక్కడా అధికారులుగానీ మరెవరూగానీ జోక్యం చేసుకునేందుకు అవకాశమే ఇవ్వ లేదు. ఈ పారదర్శక విధానంతో బార్ల లైసెన్సుల కోసం ఎక్కువ మంది పోటీపడ్డారు. దాంతో ప్రభుత్వానికి ఆదాయం కూడా ఎక్కువగా వచ్చింది. 
అదీ సంగతి.

రాష్ట్రంలో 838 బార్ల లైసెన్సుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి శని, ఆదివారాలు ఈ–వేలం నిర్వహించింది. మొత్తం 838 బార్ల కోసం 1,159మంది దరఖాస్తు చేశారు. వారిలో 1,078మంది ఈ–వేలంలో పాల్గొన్నారు. అదీ 815 బార్ల కోసమే. ( మరో 23 బార్ల లైసెన్సుల కోసం ఎవరూ ఆసక్తి చూపించలేదు. వాటి కోసం మళ్లీ ఈ–వేలం నిర్వహించాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది.) వైఎస్సార్‌సీపీ నేతలు సిండికేట్‌ అయ్యుంటే అంతమంది ఎందుకు బిడ్డింగులో పాల్గొంటారన్న నిజాన్ని ‘ఈనాడు’ ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. ముందే సిండికేట్‌ అయ్యుంటే ఆ ఒప్పందం ప్రకారం 815 మందికి 815 మందే ఈ–వేలంలో పాల్గొనేవారు. కానీ ఎక్కువ మంది పాల్గొన్నారంటే సిండికేట్‌ కాలేదన్నది స్పష్టమవుతోంది. ఇక సిండికేట్‌ అయ్యుంటే 23 బార్లకు ఎవరూ పోటీ పడకుండా ఎందుకు ఉంటారు...!? ఆ బార్లకు కూడా సిండికేట్‌ అయి తక్కువ ధరకే లైసెన్సు తీసుకునేవారు కదా. ఎందుకంటే బార్ల కోసం నోటిఫికేషన్‌ జారీ చేసిన నగరం, పట్టణాల్లో ఉన్న మార్కెట్‌ను అంచనా వేసుకునే బిడ్డర్లు పోటీ పడ్డారన్నది స్పష్టమవుతోంది. ఎక్కడా సిండికేట్‌ ఏర్పడలేదన్నది కూడా తేటతెల్లమవుతోంది.

ప్రభుత్వానికి భారీగా ఆదాయం...టీడీపీ హయాం కంటే 106 శాతం అధికం...
ఎక్కడైనా సిండికేట్‌ అయితే ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది. ప్రైవేటు వ్యక్తులకు లాభం పెరుగుతుంది. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బార్ల లైసెన్సుల కోసం నిర్వహించిన ఈ–వేలం ద్వారా ప్రభుత్వ ఆదాయం ఏకంగా 106శాతం పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ ప్రభుత్వం 2017లో ఐదేళ్లకు రెన్యూవల్‌ చేసిన 840 బార్ల లైసెన్సులతో చివరి ఏడాది అంటే 2021–22లో ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.289.14కోట్లు  మాత్రమే. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ–వేలం ద్వారా 815 బార్లకు కేటాయించిన లైసెన్సులతో మొదటి ఏడాదే రూ.506కోట్లు( దరఖాస్తు ఫీజుతో కలిపితే రూ.597.35కోట్లు)వచ్చాయి. టీడీపీ ప్రభుత్వ హయాం కంటే 106 శాతం అధికం. ఇక  2023–24, 2024–25లలో దరఖాస్తు ఫీజు ఉండదు. కానీ ప్రభుత్వ బార్‌ పాలసీలో పేర్కొన్న ప్రకారం అప్‌ సెట్‌ ధర, లైసెన్సు ఫీజు 10 శాతం చొప్పున పెరుగుతాయి. తద్వారా 2023–24లో  రూ.543కోట్లు, 2024–25లో రూ.584.41కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. 

రాష్ట్రంలో ఏకంగా 52 బార్ల లైసెన్సులను రూ.కోటి కంటే అధిక మొత్తానికి బిడ్డర్లు దక్కించుకున్నారు. అంటే ఈ–వేలంలో ఎంత తీవ్రంగా పోటీ సాగిందో తెలుస్తునే ఉంది. సిండికేట్‌ అయ్యుంటే అంతటి పోటీ జరిగేదా...!? నామమాత్రపు ధరకే లైసెన్సులు పొందేవారు కదా...!?


చదవండి: ఫుల్‌ స్పీడ్‌తో ఇళ్లు

మరిన్ని వార్తలు