బీజేపీ, టీఆర్‌ఎస్‌ తోడుదొంగలు: షర్మిల

24 Aug, 2022 01:40 IST|Sakshi

గద్వాల రూరల్‌: బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు రెండు తోడు దొంగలని వైఎస్సార్‌టీపీ రాష్ట్ర అ«ధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం గద్వాలలోని వైఎస్సార్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడారు.

సీఎం కేసీఆర్‌ దిక్కుమాలిన పాలన చేస్తూ మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని రూ.4 లక్షల కోట్ల అప్పులకుప్పగా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రతిరోజూ రైతు ఆత్మహత్యలే కనిపిస్తున్నాయంటే కేసీఆర్‌ పాలన ఎలా ఉందో స్పష్టమవుతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుని కేసీఆర్‌ కుటుంబం జేబులు నింపుకుంటోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై మాట్లాడుతున్న బీజేపీ నాయకులు సీబీఐ విచారణ ఎందుకు జరిపించడం లేదని ప్రశ్నించారు. ‘నేను గిల్లినట్లు నటిస్తా.. నీవు ఏడ్చినట్లు చేయి’ అన్న చందంగా బీజేపీ, టీఆర్‌ఎస్‌ వ్యవహారముందని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు