క్షీణిస్తున్న వైఎస్‌ షర్మిల ఆరోగ్యం

18 Apr, 2021 03:25 IST|Sakshi
దీక్షలో షర్మిల. చిత్రంలో విజయమ్మ

మూడో రోజుకు చేరిన ‘ఉద్యోగ దీక్ష’ 

కేవలం నీళ్లు తాగి దీక్ష కొనసాగింపు

షుగర్‌ లెవెల్స్‌ పడిపోయినట్లు వైద్యుల వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ దీక్ష చేస్తున్న దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్‌ షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోంది. లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగిస్తున్న షర్మిలను వైద్యులు పరీక్షించారు. షుగర్‌ లెవల్స్‌ 88 నుంచి 62కు తగ్గాయని, బరువు 2 కిలోలు తగ్గినట్లు ఆమెను పరీక్షించిన డాక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు వెంటనే ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ 72 గంటల దీక్ష చేస్తానని ప్రకటించిన షర్మిల.. గురువారం ఇందిరా పార్కు ధర్నాచౌక్‌ వద్ద దీక్ష చేపట్టారు.

పోలీసులు సాయంత్రం వరకే అనుమతివ్వడం, ఆ తర్వాత ఆమె పాదయాత్రగా లోటస్‌పాండ్‌కు బయల్దేరడం.. మధ్యలోనే పోలీసులు ఆమెను అడ్డుకుని ఆమె ఇంటివద్ద వదిలేయడంతో అక్కడే దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. మంచినీరు మాత్రమే తాగుతూ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. మీ కోసం తోడబుట్టిన అక్కగా నేను పోరాటం చేస్తా. ప్రభుత్వ రంగంలోనే కాదు.. ప్రైవేట్‌రంగం లో కూడా 11 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్సార్‌ది’అని అన్నారు. షర్మిలకు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయలక్ష్మి మద్దతు తెలిపారు. ఆటో యూనియన్‌ నేత అమానుల్లాఖాన్‌  ఆటోలతో భారీ ర్యాలీగా వచ్చి షర్మిలకు మద్దతు తెలిపారు.

చదవండి: కాంగ్రెస్‌ వడివడిగా..

మరిన్ని వార్తలు