హుజూరాబాద్‌లో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలి: షర్మిల

8 Sep, 2021 08:29 IST|Sakshi
నిరుద్యోగ నిరాహార దీక్షలో మాట్లాడుతున్న వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల

కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ: షర్మిల

సాక్షి, పాలమూరు: హుజూరాబాద్‌ ఎన్నికలో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని, ఈ ఎన్నికల్లో నిరుద్యోగులు వందల సంఖ్యలో నామినేషన్లు వేయాలని, అందుకు వారికి తగిన సహకారం అందిస్తామని వైఎస్సార్‌టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అఫ్గానిస్తాన్‌ తాలిబన్ల చేతిలో బందీ అయినట్లు తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం చేతిలో చిక్కుకుందని ఆమె ఘాటుగా విమర్శించారు. వైఎస్సార్‌టీపీ ఆధ్వర్యంలో షర్మిల మంగళవారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ ఎదుట ఒకరోజు నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో కేసీఆర్‌ ఒక నియంతలా మారారని, ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయికి పెరిగిందన్నారు.

టీఆర్‌ఎస్‌ హయాంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 7వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. పాలమూరు వర్సిటీలో 13 ప్రొఫెసర్‌ పోస్టులకు అన్నీ ఖాళీగా ఉన్నాయని, ఇక 24 అసోసియేట్‌ పోస్టులకు 20, 58 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 40 ఖాళీగా ఉన్నాయన్నారు. 95 బోధన అధ్యాపకుల పోస్టులకు 22 మంది పని చేస్తున్నారన్నారు. సీఎం గొర్రెలు, బర్రెలు పెంచుకోవాలని చెబుతుంటే మరో మంత్రి హమాలీ పనులు చేసుకోవాలని చెప్పడం సిగ్గుచేటన్నారు.
చదవండి: నిఖార్సయిన బీసీ బిడ్డ గెల్లు.. పావలా బీసీ ఈటల
దో షేర్‌.. దో బకరే 

మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో వ్యవసాయాన్ని పండుగలా చేశారని, అలాంటి మహానేతపై ఇక్కడి మంత్రి అనాలోచితంగా మాట్లాడటం సరికాదన్నారు. దీక్షలో గాయకుడు ఏపూరి సోమన్న ఆట, పాట ఆకట్టుకుంది. కొండా రాఘవరెడ్డి, పిట్ల రాంరెడ్డి, రాజ్‌గోపాల్, భూమిరెడ్డి, సరస్వతి, తమ్మలి బాల్‌రాజు, బీస మరియమ్మ, జెట్టి రాజశేఖర్, హైదర్‌అలీ దీక్షలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు