Munugodu Politics: మునుగోడు బరిలోకి వైఎస్సార్‌టీపీ! 

27 Aug, 2022 14:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ(వైఎస్సార్‌టీపీ) కూడా పోటీ చేయనుంది. ఈ ఎన్నికల్లో పోటీ ద్వారా ఉనికి చాటుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే రంగం సిద్ధం చేసిన ఆ పార్టీ.. బరిలో బీసీ అభ్యర్థిని దించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా తమ అభ్యర్థిని పోటీలోకి దించాలని పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిర్ణయించారు.

ఇదిలా ఉండగా.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు, పార్టీల బలాబలాలపై కూడా సర్వే చేయించారు. ఈ సర్వే నివేదికలు ఎలా ఉన్నప్పటికి ఉప ఎన్నికలో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు పార్టీవర్గాలు తెలిపాయి. ప్రధాన పార్టీల ఎత్తుగడలను దీటుగా ఎదుర్కోవాలని భావిస్తున్న వైఎస్సార్‌టీపీ.. మునుగోడులో బీసీ అభ్యర్థి ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. తద్వారా మూడు పార్టీలకు గట్టి పోటీ ఇవ్వవచ్చని అంచనా వేస్తోంది. ఈ మేరకు బలమైన అభ్యర్థి గురించి అన్వేషిస్తోంది. అభ్యర్థిని ఖరారు చేసేందుకు అంతర్గతంగా కమిటీ కూడా వేసింది. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన అభ్యర్థిని చేరదీయడం ద్వారా.. సులువుగా ప్రజల్లోకి వెళ్లవచ్చని ఆలోచన చేస్తోంది. 

చదవండి: (కాంగ్రెస్‌లో సీనియర్లు, పెద్దలు అంతా అక్కడే.. భీకర పోరు తప్పదా?)

మరిన్ని వార్తలు