ఈ కుట్ర చంద్రబాబుదే

21 Oct, 2021 03:54 IST|Sakshi
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే విడదల రజినితో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు బాబు పక్కా ప్రణాళిక   

ఇందులో భాగంగానే అసభ్య పదజాలంతో సీఎం వైఎస్‌ జగన్‌పై పట్టాభి దూషణలు 

దానికి ప్రతి చర్యగా కడుపు మండి టీడీపీ కార్యాలయంపైకి వెళ్లిన ప్రజలు 

దీన్ని సాకుగా చూపి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ బాబు హంగామా 

బూతులు తిడితే పవన్‌ కళ్యాణ్, సీపీఐ నేతలు ఊరకుంటారా? 

రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇస్తే.. ఒక్క బడ్డీ కొట్టూ మూయలేదు.. అదీ చంద్రబాబు కెపాసిటీ 

సీఎం వైఎస్‌ జగన్‌ను దూషిస్తే.. ప్రతి చర్యలు ఇలాగే ఉంటాయి 

ఇకపైనా టీడీపీ నేతలు తీరు మార్చుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతల హితవు 

మోదీ, అమిత్‌షాను తిట్టి, అమిత్‌షా కారు మీద రాళ్లు వేయించిన చంద్రబాబు.. ఇప్పుడు ఆయన వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తాడట. చంద్రబాబు ఎలాంటి వాడో వారికి తెలియదా? పోసాని కృష్ణ్ణమురళి ఇంటి మీద దాడి జరిగితే, చంద్రబాబు మాట్లాడలేదు. పవన్‌ కళ్యాణ్‌ కనీసం ఖండించలేదు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్‌లో రెండు కుర్చీలు విరిగి, అద్దాలు పగిలితే వెంటనే పవన్‌ కళ్యాణ్‌ స్పందించాడు. కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరాడు. దీన్ని బట్టి పవన్‌కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ ఒకటేనని అర్థమవుతోంది. 

నిన్నటి ఘటనలు ఎందుకు జరిగాయో అందరూ ఆలోచించాలి. ఇందుకు ఎవరు కారణమో అర్థమవుతుంది. రియాక్షన్‌ ఎందుకు వచ్చిందో స్పష్టంగా అర్థమవుతుంది. కోట్లాది మంది ప్రజలు అభిమానిస్తున్న నాయకుడిని, రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఓట్లేసి గెలిపించిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన బూతులే ఈ ప్రతిచర్యల వెనుక బలమైన కారణాలు. బోషడీకే అన్నారు. ఇది చాలా పెద్ద బూతు పదం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ఒక ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇంత దారుణంగా మాట్లాడితే, ఆ మాటలు టీవీ ఛానళ్లలో ప్రసారం అవుతుంటే, వాటిని ప్రజలు చూస్తున్నప్పుడు సహజంగానే తీవ్ర భావోద్వేగాలు చెలరేగుతాయి. ఇది సహజం. ఇక్కడ చంద్రబాబు చేయించినది చర్య అయితే, జగన్‌ అభిమానులు తిరగబడటం కేవలం ప్రతి చర్య.  
– వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల, మంత్రులు కొడాలి నాని, శ్రీరంగనాథరాజు, బాలినేని, కన్నబాబు, ఆదిమూలపు సురేష్, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు 

సాక్షి, అమరావతి: రెండున్నరేళ్లుగా ప్రజారంజక పాలన అందిస్తూ.. కోట్లాది మంది ప్రజల మన్ననలు అందుకుంటున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మూక అసభ్య పదజాలంతో దూషించడం వల్లే మంగళవారం ప్రజలు ప్రతి చర్యకు దిగారని వైఎస్సార్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. ‘టీడీపీ నాయకుడు పట్టాభి అనాలోచితంగా మాట్లాడిన మాటలు కావవి. పక్కా ప్లాన్‌తో చంద్రబాబు పలికించిన మాటలు. ప్రజలను రెచ్చగొట్టి.. భావోద్వేగాల ఆధారంగా రాజకీయం చేసి లబ్ధి పొందాలనే కుట్ర.

ఈ విషయాలపై ప్రజలు ఆలోచించాలి’ అని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, హైదరాబాద్‌లో మంత్రి కురసాల కన్నబాబు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌ను దూషిస్తే.. ప్రతి చర్యలు ఇలాగే ఉంటాయని, ఇకపైనా టీడీపీ నేతలు తీరు మార్చుకోవాలని వారు హితవు పలికారు. ఆయా సమావేశాల్లో వారు ఇంకా ఏమన్నారంటే.. 

పశ్చిమ గోదావరి జిల్లా  ఏలూరులో నిరసన తెలుపుతున్న మేయర్‌ షేక్‌ నూర్జహాన్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు  

► నిన్న ఉదయం చంద్రబాబును పట్టాభి కలిశాడు. ఆ తర్వాత ఉద్దేశ పూర్వకంగానే, చంద్రబాబు ఆదేశించిన విధంగానే ఈ మాటలు మాట్లాడాడు. అంటే మాట్లాడినది పట్టాభి. మాట్లాడించింది చంద్రబాబు. అందుకే చంద్రబాబు ఈ మాటల్ని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు.  
► అసలు ఆ మాటల ప్రస్తావనే చంద్రబాబు చేయటం లేదు. తానే ఆదేశించి, తానే మాట్లాడించి.. తానే ఇప్పుడు డ్రామా మొదలుపెట్టాడు. ఈ బూతు పురాణానికి కర్త, కర్మ చంద్రబాబు. తప్పు చేసి, చేయించి.. అభిమానుల్ని రెచ్చగొట్టి.. ఆ తర్వాత దాడి జరిగిందని గగ్గోలు పెట్టటం చంద్రబాబుకే సాధ్యం. 
► మాట్లాడిన వ్యక్తి.. ఒక పార్టీకి అధికార ప్రతినిధి. ఆ మాటలను చంద్రబాబు ఆథరైజ్‌ చేశారు. వాటికి ఆమోద ముద్ర వేశారు. ఒక అధికార ప్రతినిధిగా, ఆ పార్టీ అధినాయకుడి ఆమోదంతో, ఆపార్టీ ఆథరైజేషన్‌తో.. రాజ్యాంగ హోదాలో ఉన్న ముఖ్యమంత్రిపై ఇలాంటి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. 
► ప్రెస్‌మీట్లు యథాలాపమైన భాషతోనో, భావోద్వేగాలతోనో ఉండవు. అవి స్క్రిప్టెడ్‌గా, ముందు అనుకున్న విధంగా ఉంటాయి. ముందు తాను చెప్పిన విధంగా రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎంని పట్టాభి పచ్చి బూతులు తిట్టాడు కాబట్టే చంద్రబాబు, ఆయన కొడుకు మహదానందంగా పట్టాభి ఇంటికి వెళ్లి పరామర్శించారు. 
► రాజ్యాంగం, ప్రజలు ఇచ్చిన అధికారంతో సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. అలాంటి మాటలు అన్న తర్వాత.. అభిమానస్తులు సహజంగానే బాధ పడతారు. తీవ్ర ఆవేదనకు గురవుతారు. తీవ్ర భావోద్వేగాలకు గురవుతారు. అలాంటి సందర్భంలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సహజం.  
► ఇలాంటి భావోద్వేగాలను పెంచాలని, రెచ్చగొట్టాలని ముందుగా నిర్ణయించుకునే చంద్రబాబు పట్టాభికి ట్యూటరింగ్‌ చేసి మాట్లాడించాడు. పార్టీ వారిని రెచ్చగొట్టాడు. కొద్ది రోజుల క్రితం కాకినాడలో కూడా ప్రజల నుంచి, ప్రత్యేకించి మత్స్యకారుల నుంచి ఇలాంటి స్పందనే వచ్చింది. విషయం తెలిసే ఉద్దేశపూర్వకంగానే పట్టాభిని బూతులు మాట్లాడమని ప్రిపేర్‌ చేసి పంపి, తానూ అక్కడే ఉండి డ్రామా ఆడించాడు.  
► ముఖ్యమంత్రికి ఉన్న కోట్లాది అభిమానుల్లో కడుపు మండిన వారు గట్టిగా తిరగబడ్డారు. ఇది సహజం. ఇక్కడ చంద్రబాబు చేయించినది చర్య అయితే, జగనన్న అభిమానులు తిరగబడటం కేవలం ప్రతి చర్య. మొదటిది లేకపోతే.. అంటే, బూతులు తిట్టించకపోతే, ప్రతి చర్యకు అవకాశమే లేదు. ఈ విషయం పట్టాభి తిట్లు విన్న వారెవరికైనా అర్థం అవుతుంది.  
► మహారాష్ట్రలో కేంద్ర మంత్రి నారాయణ్‌ రాణే చెప్పుతో కొడతానని రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే.. ఏం జరిగిందో మీకు తెలుసు. టీడీపీ నాయకులు బూతులు, దారుణమైన వ్యాఖ్యలు, సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిపైన, ఒక పార్టీ అధ్యక్షుడిపైన చేసిన కామెంట్లు.. సహజంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిస్పందనలకు దారితీశాయి. 
► ఇవాళ చంద్రబాబును, టీడీపీని సమర్థిస్తూ  కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. వారందరికీ కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాం. పా
ర్టీలు, రేపు మిమ్మల్ని కూడా టీడీపీ నాయకులు బోషాడీకే అని, లంజాకొడుకులని తిడతారు. మీరు కూడా ఆ మాటలను పడాల్సి వస్తోందని ముందుగానే ఆయా పార్టీలను, నాయకుల్ని అప్రమత్తం చేస్తున్నాం.  
► ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై అన్నమాటలు.. ఇక్కడితో ఆగిపోవు. రాజ్యాంగ పదవులైన జడ్జిలపైనా, ప్రధాన మంత్రిపైనా, రాష్ట్రపతిపైనా.. చివరకు మీపైన కూడా మాట్లాడతారు. బూతులను ఇష్టానుసారం ప్రయోగిస్తారు. అలా మాట్లాడితే ఏం కాదులే అన్న భావనలోకి వస్తారు. అసలు ఇలాంటి మాటలను ప్రజాస్వామ్యంలో మాట్లాడ్డం కరెక్టేనా? అని వీరంతా ఆలోచించాలి. 

రాజకీయ పార్టీగా అర్హత కోల్పోయిన టీడీపీ  
పట్టాభి దూషించకుంటే.. టీడీపీ కేంద్ర కార్యాలయంపై సీఎం వైఎస్‌ జగన్‌ను అభిమానించే ప్రజలు ప్రతి చర్యకు దిగేవారు కాదు. ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత చంద్రబాబుదే. ప్రజలు ప్రతి చర్యకు దిగిన వెంటనే పట్టాభి చేసిన దూషణలను తప్పుపట్టాల్సిందిపోయి చంద్రబాబు తద్భిన్నంగా వ్యవహరించారు. బుధవారం రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్‌ చేశారు. రెండున్నరేళ్లుగా సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న పథకాలు.. ప్రజల్లోకి వెళ్తున్న తీరు.. విశ్వాసాన్ని నిలబెట్టుకుంటున్న విధానం.. పంచాయతీ, మునిసిపల్, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక, పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఆఖండ మెజార్టీతో విజయం సాధించడం.. వీటన్నింటి దృష్ట్యా చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కాక.. ప్రజలను తప్పుదోవ పట్టించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు.

ఒక అబద్ధం చుట్టూ వంద అబద్ధాలను అల్లీ అల్లీ అబద్ధపు మేడ కడుతున్నారు. దానిలో నుంచి ఏదో ఒక ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్‌ వ్యహారంలో టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు చేసిన ఆరోపణలకు ఏవైనా ఆధారాలు ఉంటే ఇవ్వమని మంగళవారం పోలీసులు నోటీసు ఇచ్చారు. టీడీపీ సర్కార్‌ హయాంలో వైఎస్సార్‌సీపీ నేతలకు ఎన్నోసార్లు నోటీసులు ఇచ్చారు. అప్పట్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పట్ల అనైతికంగా ప్రవర్తించారు. గతంలో అయ్యన్న పాత్రుడు సీఎం వైఎస్‌ జగన్‌పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జోగి రమేష్‌ కలత చెంది, అది తప్పు అని చెప్పడానికి చంద్రబాబు ఇంటి వద్దకు పోయినప్పుడు.. నిమిషాల వ్యవధిలోనే టీడీపీ నాయకులు చేరారు. కానీ మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి అలా ఎందుకు రాలేదు? చంద్రబాబు అమిత్‌షాతో మాట్లాడాడంట.

నిజంగా కేంద్ర హోం మంత్రి స్పందించారో లేదో తెలియదు. ఎందుకంటే ఆయన చెప్పడు కదా. చంద్రబాబు డ్రామాకు తెర తేసిన వెంటనే.. టీడీపీ ఆఫీసులపై దాడిని కొన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. అంటే ఆ పార్టీలు పట్టాభి అన్న ఆ మాటను స్వాగతిస్తున్నాయా? పవన్‌కళ్యాణ్‌.. సీపీఐ నాయకులు.. ఆ మాట తప్పు అని ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఇంత జరిగినా రెండు పత్రికల తీరు అంతే. మిమ్మల్ని అదే మాట అంటే ఊర్కుంటారా? తప్పు పట్టరా? అని ఆ పత్రికల యాజమాన్యాలను అడుగుతున్నాం. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని చంద్రబాబు అంటున్నారు? చంద్రబాబుకు ఆ నమ్మకం ఉంటే, బద్వేలు ఉప ఎన్నికలో ఎందుకు పోటీ చేయలేదు?  
– సజ్జల రామకృష్ణారెడ్డి 

మరిన్ని వార్తలు