చేతల నేత సీఎం జగన్‌

10 Mar, 2023 04:26 IST|Sakshi

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యం

మోసం చేసిన చంద్రబాబును అందరూ నిలదీయాలి  

నామినేషన్‌ల అనంతరం మీడియాతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు

సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సామాజిక న్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ అభ్యర్థులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గురువారం అసెంబ్లీ కమిటీ హాలులో నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఎందుకు ఇన్ని అవకాశాలు ఇవ్వలేదు? సీఎం జగన్‌ సామాజిక సాధికారతను చేతల్లో చూపుతున్నారు.

మూడున్నరేళ్లలో సామాజిక విప్లవం తీసుకొచ్చారు. గతంలో ఈ వర్గాలకు మేలు చేయాలన్న కనీస ఆలోచన కూడా చేయని చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా 18 స్థానాల్లో 11 మంది బీసీలు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీ, నలుగురు ఓసీలను ఎంపిక చేసి, ఆయా వర్గాల పట్ల తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు’ అని కొనియాడారు. వివరాలు వారి మాటల్లోనే..

సొంత సామాజికవర్గం బాగు కోసమే బాబు కృషి
చంద్రబాబు నమ్మక ద్రోహి. కుల అహంకారి. 1999 నుంచి రాజకీయాల్లో ఉన్న నేను ఆయన నైజాన్ని చూశా. నా దగ్గర ఉన్న డబ్బు చూసి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చంద్రబాబు చెప్పారు. నాతోనే మిగిలిన నియోజకవర్గాల్లో డబ్బులు ఖర్చు పెట్టించారు. 2014లో నేను గెలిచే సీటు అని తెలిసినా, నన్ను పోటీ చేయకుండా ఆపేశాడు.

చంద్రబాబు, వెంకయ్యనాయుడు.. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. డబ్బు వున్న వారికే టీడీపీ టికెట్లు ఇస్తుంది. సొంత సామాజిక వర్గం బాగు కోసమే చంద్రబాబు పని చేశారు. బెంజ్‌ కారులో తిరిగిన నన్ను డొక్కు కారులో తిరిగేలా చేశారు. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ అనే దేవుడి రూపంలో నాకు న్యాయం జరిగింది.   – జయమంగళ వెంకటరమణ (బీసీ, ఏలూరు జిల్లా)

నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం 
రాజకీయ సాధికారత అంటే పదవుల్లో మాత్రమే కాదు.. అధికారంలో కూడా పాలు పంచుకునేలా భాగస్వాములను చేయడమే అని సీఎం జగన్‌ నిరూపించారు. బలహీన వర్గాలకు మేలు చేయలన్నా బలమైన ఆలోచన ఉంటేనే ఇది సాధ్యం. సీఎం జగన్‌ ఒక నిశ్శబ్ద విప్లవానికి శ్రీకారం చుట్టారు. – పెన్మత్స వీవీ సూర్యనారాయణ రాజు (ఓసీ, విజయనగరం జిల్లా)

చంద్రబాబు కుల అహంకారి
2014–19 మధ్య టీడీపీ శాసన­మండలికి 48 మందిని పంపగలిగితే, అందులో ఓసీలు 30 మంది కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ­లు 18 మంది మాత్రమే. టీడీపీ వంచనకు ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు. సీఎం వైఎస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 68.18 శాతం కేటాయించడం ఆయన చిత్తశుద్ధిని నిరూపిస్తోంది. చంద్రబాబు పెద్ద కుల అహంకారి. సీఎం జగన్‌ నాకు దేవుడిచ్చిన అన్నయ్య.– పోతుల సునీత (బీసీ, చీరాల, బాపట్ల జిల్లా)

బీసీ అంటే బ్యాక్‌ బోన్‌..
బీసీలంటే కేవలం బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదని, బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అని వైఎస్సార్‌­సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ గుర్తించి ఆ వర్గాలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవులు, స్పీకర్‌గా బీసీ, మండలి చైర్మన్‌గా ఎస్సీ, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ మహిళకు అవకాశం ఇచ్చారు.  పదవులన్నిటిలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రా«ధాన్యమిచ్చారు. సీఎం జగన్‌ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటారు. – కోలా గురువులు (బీసీ, విశాఖ సౌత్‌)

సామాజిక న్యాయానికి అసలైన నిర్వచనం 
కులాలను చీల్చే విధంగా కాకు­ండా స్ఫూర్తిదాయక విధానా­లతో సామాజిక న్యాయా­నికి అసలైన నిర్వచ­నం చెప్పారు సీఎం జగన్‌. గతంలో టీడీపీ అన్ని విధాలుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను వంచించింది. చెప్పిందొకటి. చేసింది మరొకటి. ఊపిరి ఉన్నంత వరకు సీఎం జగన్‌తో ఉంటాను. – బొమ్మి ఇజ్రాయేల్‌ (ఎస్సీ, (మాదిగ), అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా) 

ఎందుకు మోసం చేశావని బాబును నిలదీయాలి
మరో ఏడాదిన్నరలో ఎన్నికలు ఉన్నందున బాబు, ఎల్లో మీడియా.. రోజు వారీ తోలు బొమ్మలను తెచ్చి ప్రదర్శనలు ఇస్తూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని చూస్తున్నారు. వారి మొహం మీద చరిచినట్లుగా అన్ని పదవుల్లోనూ, అధికారంలోనూ ఇంతగా అట్టడుగు వర్గాలకు వైఎస్సార్‌సీపీ ఇస్తున్న ప్రాధాన్యాన్ని గుర్తించాలని బీసీలను కోరుతున్నాం. ఎందుకు మోసం చేశావని చంద్రబాబును నిలదీయాలని కోరుతున్నాం.   – చంద్రగిరి ఏసురత్నం (బీసీ. వెస్ట్‌ గుంటూరు)

గొప్ప మానవతా మూర్తి 
నమ్మకానికి, ఇచ్చినమాట నిలబెట్టుకు­­నేదానికి సీఎం జగన్‌ ప్రతిరూపం. ఒకసారి మాట ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా నెరవేర్చే తత్వం. ఇచ్చిన మాట మేరకు నాకు మేలు చేశారు. సీఎం జగన్‌ ఏమి చెబితే అది చేయటమే నా కర్తవ్యం. రాజకీయాల్లో గొప్ప మానవతా విలువలు వంట పట్టించుకున్న మానవతా మూర్తి సీఎం జగన్‌. రాజకీయాల్లో సోషల్‌ ఇంజినీరింగ్‌ అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్‌ మాత్రమే.     – మర్రి రాజశేఖర్‌ (ఓసీ, చిలకలూరిపేట) 

మరిన్ని వార్తలు