వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసమే ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిశారని ఆయన స్పష్టం చేశారు. వ్యక్తిగత ఎజెండా కోసం కలిశారని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. (చదవండి: ‘జగనన్న విద్యా కానుక’లో ఏమున్నాయంటే..)
‘‘10 ఏళ్ల రాజధానిగా హైదరాబాద్ ఉన్నా.. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు భయపడి ఏపీకి పారిపోయారు. కేసుల గురించి సీఎం జగన్ భయపడరు. కేసులు మమ్మల్ని ఏమీ చేయలేవు. సీఎం జగన్పై ఉన్నవన్ని కుట్రపూరితమైన కేసులే. ఆ విషయాన్ని ప్రజలు గమనించారు.151 సీట్లతో సీఎం జగన్ను అఖండ మెజార్టీతో గెలిపించారు. చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించారు. చీకట్లో చిదంబరాన్ని కలిసిన చరిత్ర చంద్రబాబుదే.రాష్ట్ర ప్రయోజనాలే సీఎం జగన్కు ముఖ్యం. కేంద్ర పదవులు మాకు అవసరం లేదు. చంద్రబాబు మారకుంటే మళ్లీ ప్రజలు బుద్ధి చెబుతారని’’ ఆయన దుయ్యబట్టారు. ఆంధ్రజ్యోతి కథనంలో అసలు జర్నలిజం విలువలు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. ప్రధానికి ఎవరైనా కోర్టులపై ఫిర్యాదు చేస్తారా?. ప్రధాని బల్ల కింద రాధాకృష్ణ ఏమైనా దూరారా?. ఇలాంటి రాతలు రాసేందుకు రాధాకృష్ణకు సిగ్గుందా?. ప్రధాని, కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలిసినప్పుడల్లా ఆంధ్రజ్యోతి విషప్రచారం చేస్తోందని అంబటి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రయోజనాలే సీఎం జగన్కు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: తరగని ఆస్తి చదువు ఒక్కటే: సీఎం జగన్)