ఉద్యోగాల భర్తీపై టీడీపీ తప్పుడు ప్రచారం

19 Jul, 2021 16:44 IST|Sakshi

ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం ఏ మంచి పని చేసినా విమర్శించడమే టీడీపీకి అలవాటని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గ్రామ సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలు ప్రకటించిన వెంటనే నిరుద్యోగుల మనోభావాలను గాయపరిచేలా చంద్రబాబు విమర్శలు చేశారని ధ్వజమెత్తారు.

ఉద్యోగాల భర్తీపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు తన హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ‘‘కేవలం రెండేళ్లలో లక్షా 84 వేల ఉద్యోగాలు ఇచ్చాం. 4 లక్షల ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాదిపదికన 20 వేల ఉద్యోగాలు ఇచ్చామని’’ వివరించారు. వచ్చే ఏడాది మరిన్ని ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని కాకాణి వెల్లడించారు.

‘‘టీడీపీలో ఉచ్చులో వామపక్షాలు పడటం దురదుష్టకరం. లోకేష్.. ఉద్యోగాల గురించి మాట్లాడటం దౌర్భాగ్యం. నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చాలనే ఉద్దేశంతో నిరసనలకు పిలుపునిచ్చారు. గతంలో నిరుద్యోగులను వంచించిన చంద్రబాబు.. ఇవాళ నిరుద్యోగులకు మాయమాటలు చెబుతున్నారంటూ’’ ఎమ్మెల్యే కాకాణి నిప్పులు చెరిగారు.

మరిన్ని వార్తలు